ప్రత్యేకంహోమ్

అమెరికా ఫైటర్ జెట్ ను కూల్చిన ఇరాన్

#USFighterJet

కొనసాగుతున్న మధ్యప్రాచ్య యుద్ధంలో అమెరికాకు భారీ నష్టం వాటిల్లింది. ప్రపంచంలోనే మొదటిసారిగా అమెరికాకు చెందిన అత్యాధునిక యుద్ధవిమానం F-35 Lightning II పై ఇరాన్ గురువారం దాడి చేసింది. దాడి చేయడమే కాకుండా విజయవంతంగా కూల్చివేసింది.

ఈ యుద్ధవిమానం అమెరికా వైమానిక దళానికి కీలకమైన ఐదవ తరం (ఫిఫ్త్ జనరేషన్) స్టెల్త్ ఫైటర్‌గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం 19కు పైగా దేశాలు ఈ విమానాన్ని వినియోగిస్తున్నాయి. అమెరికా రక్షణ శాఖ అధికారులను ఉటంకిస్తూ ఒక ఇంగ్లీష్ వార్తా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, ఇరాన్ నుంచి ప్రయోగించిన సర్ఫేస్-టు-ఎయిర్ మిసైళ్ల దాడి తరువాత ఒక F-35 విమానం అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.

పైలట్ సురక్షితంగా ఉన్నాడని, ఘటనపై విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కాప్స్ (IRGC) ప్రకటనలో ఈ వివరాలను వెల్లడించింది. స్థానిక సమయం ప్రకారం తెల్లవారుజామున 2:50 గంటలకు తమ ఆధునిక వైమానిక రక్షణ వ్యవస్థలతో అమెరికా యుద్ధవిమానాన్ని కూల్చివేసినట్లు పేర్కొంది.

విమానం పరిస్థితి ఇంకా స్పష్టంగా తెలియదని, అది కూలిపోయే అవకాశముందని తెలిపింది. ఇరాన్ రక్షణ వ్యవస్థలు ఇప్పటికే 125కిపైగా అమెరికా-ఇజ్రాయెల్ డ్రోన్లను కూల్చివేశాయని IRGC పేర్కొంది. ఇది తమ ఎయిర్ డిఫెన్స్ నెట్‌వర్క్‌లో జరిగిన అభివృద్ధిని సూచిస్తుందని తెలిపింది.

అమెరికా తిరుగులేని శక్తి అని ప్రకటించిన ఒక్క రోజులో…..

ఈ ఘటనకు ఒక రోజు ముందు, వైట్ హౌస్ ప్రతినిధి తమ సోషల్ మీడియా పోస్టులో F-35 ను “అమెరికా శక్తికి ప్రతీక”గా అభివర్ణించారు. అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రతినిధి క్యాప్టెన్ టిమ్ హాకిన్స్ తెలిపిన వివరాల ప్రకారం, ఆ యుద్ధవిమానం ఇరాన్ గగనతలంలో ఆపరేషన్‌లో ఉండగా ఈ ఘటన జరిగింది.

అయినప్పటికీ విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని, పైలట్ పరిస్థితి స్థిరంగా ఉందని తెలిపారు. ఈ దాడి నిజమైతే, ప్రస్తుత యుద్ధంలో ఇరాన్ అమెరికా యుద్ధవిమానాన్ని తొలిసారి తాకిన ఘటనగా ఇది నిలుస్తుంది. ఫిబ్రవరి చివర్లో ప్రారంభమైన ఈ ఘర్షణలో అమెరికా, ఇజ్రాయెల్ F-35 విమానాలను విస్తృతంగా వినియోగిస్తున్నాయి.

ఒక్కో విమానం ధర సుమారు 100 మిలియన్ డాలర్లకు పైగా ఉంటుంది. అయితే, ఈ ఘటన జరిగినప్పటికీ అమెరికా తమ యుద్ధ ప్రణాళిక సక్రమంగా కొనసాగుతోందని పేర్కొంది. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగస్తే “మేము స్పష్టంగా గెలుస్తున్నాం” అని ప్రకటిస్తూ, ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలను భారీగా దెబ్బతీశామని తెలిపారు.

యుద్ధంలో ఇరు పక్షాలకూ భారీ నష్టం

ఇక ఈ యుద్ధంలో కొన్ని ఇతర ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థల వల్ల పొరపాటున మూడు F-15 Eagle యుద్ధవిమానాలు కూల్చివేయబడ్డాయి. అందులో ఉన్న ఆరుగురు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. మరో ఘటనలో గత వారం పశ్చిమ ఇరాక్‌లో ఒక KC-135 Stratotanker కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు సిబ్బంది మృతి చెందారు.

ఇది శత్రు దాడి కారణంగా కాకుండా జరిగిన ప్రమాదమని అమెరికా సైన్యం తెలిపింది. ఇదే సమయంలో, పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అమెరికా 31వ మెరైన్ ఎక్స్‌పిడిషనరీ యూనిట్‌ను ఈ ప్రాంతానికి పంపిస్తోంది. అలాగే USS Tripoli కూడా ఆసియా ప్రాంతం వైపు కదులుతున్నట్లు సమాచారం.

Related posts

ప్రధాని మోడీ అవతార పురుషుడు

Satyam News

ముద్రగడ పద్మనాభంను పరామర్శించిన సజ్జల

Satyam News

కేరళ ముఖ్యమంత్రగా వీ డీ సతీషన్

Satyam News

తాసిల్దార్ వేధింపులతో వీఆర్వో ఆత్మహత్యాయత్నం

Satyam News

చైనా సరిహద్దు వద్ద భద్రత పెంచిన భారత్

Satyam News

16న బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ధార్మికోపన్యాసం

Satyam News

Leave a Comment