రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణంలో భారీ అవినీతి జరుగుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టీ.హరీష్ రావు ఆరోపించారు. హైదరాబాద్లోని బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన నేడు మీడియాతో చిట్చాట్ నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 76 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు టెండర్లు పూర్తయ్యాయని, అయితే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న 26 నియోజకవర్గాలకు ఒక్క స్కూల్ కూడా కేటాయించలేదని హరీశ్ రావు పేర్కొన్నారు. కక్షపూరిత ధోరణితోనే ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. అదే సమయంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు, అలాగే కొంతమంది బీజేపీ ఎమ్మెల్యేలకు మాత్రం స్కూళ్లు కేటాయించడం అనుమానాలకు తావిస్తోందన్నారు.
ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల టెండర్లలో కాంట్రాక్టర్లు ఒక రింగ్గా ఏర్పడి పనులను పంచుకున్నారని ఆరోపించారు. ప్రతి టెండర్లో 4.59 శాతం నుంచి 4.96 శాతం వరకు ఎక్సెస్ ధర కోట్ చేసి, నిబంధనల ప్రకారం 5 శాతం దాటకుండా పక్కా ప్రణాళికతో ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారని అన్నారు.
ఒక్కో స్కూలుకు సుమారు రూ.250 కోట్లు కేటాయించగా, అందులో సివిల్ వర్క్స్కే రూ.150 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారని తెలిపారు. మొత్తం 76 స్కూళ్లకు ప్రభుత్వ అంచనా వ్యయం రూ.10,199.54 కోట్లు కాగా, టెండర్ల ద్వారా ఇది రూ.10,693.55 కోట్లకు చేరిందని, దీంతో సుమారు రూ.494 కోట్లు అదనంగా ప్రజాధనం ఖర్చవుతోందని చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ సహా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గం మధిరలో 4.95 శాతం ఎక్సెస్తో టెండర్లు ఖరారు కావడం పలు అనుమానాలకు కారణమని అన్నారు. అలాగే పలు మంత్రుల నియోజకవర్గాల్లో కూడా 4.9 శాతం చుట్టుపక్కలే టెండర్లు ఫైనల్ కావడం కుంభకోణానికి నిదర్శనమని విమర్శించారు.
సీఎంకు వాహనం ఇచ్చిన సంస్థకు టెండర్లు
ముఖ్యమంత్రి వాడుతున్న వాహనం KLSR కంపెనీ పేరిట ఉండగా, అదే సంస్థకు మొత్తం 9 స్కూళ్ల టెండర్లు ఇవ్వడం ఆశ్చర్యకరమని హరీశ్ రావు అన్నారు. ఇది ప్రభుత్వంలో జరుగుతున్న అనుచిత వ్యవహారాలకు ఉదాహరణ అని పేర్కొన్నారు.
గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ఎలాంటి రాజకీయ పక్షపాతం లేదని, రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు సమాన ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, గురుకుల పాఠశాలలు వంటి పథకాలు అన్ని ప్రాంతాల్లో సమానంగా అమలు చేశామని గుర్తుచేశారు.
దళిత బంధు వంటి పథకాన్ని ప్రతిపక్ష నేత నియోజకవర్గంలోనే ప్రారంభించిన ఘనత తమదేనని, కానీ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం రాజకీయ కక్షతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలను విస్మరించిందని విమర్శించారు.
ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల టెండర్లలో జరిగిన ఈ భారీ కుంభకోణంపై శాసనసభలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని హరీశ్ రావు హెచ్చరించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయని, అసెంబ్లీ సమావేశాల్లో వాటిని బయటపెడతానని తెలిపారు.
