ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్ఛీ పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ తో నేడు ఇస్లామాబాద్ లో సమావేశమయ్యారు. అమెరికాతో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, చర్చల్లో స్థబ్దత నెలకొన్న సమయంలో ఈ పర్యటనకు ప్రాధాన్యత పెరిగింది.
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్ఛీ పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ మద్య ప్రాంతీయ భద్రత, మధ్యప్రాచ్య పరిణామాలు, అలాగే అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఇస్లామాబాద్ నగరం ఈ సమయంలో కఠిన భద్రతా చర్యలతో కట్టడి చేసి ఉంది.
ముఖ్య రహదారులు మూసివేశారు. అత్యంత భద్రతా ప్రాంతంగా భావించే రెడ్ జోన్ను పూర్తిగా నిర్బంధించారు. ఈ నేపథ్యంలో ఉన్నతస్థాయి సమావేశాలు సాగుతున్నాయి. మరోవైపు, పాకిస్థాన్ ఉప ప్రధానమంత్రి ఇషాక్ దార్ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ, ఇరాన్ విదేశాంగ మంత్రిని స్వాగతించడం సంతోషంగా ఉందని తెలిపారు.
ప్రాంతీయ శాంతి, స్థిరత్వం కోసం పరస్పర చర్చలు కొనసాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో, అమెరికా వైట్ హౌస్ ప్రకటించిన ప్రకారం, అమెరికా ప్రతినిధులు స్టీవ్ వెట్ కాఫ్, జార్డ్ ఖుష్నర్ కూడా ఇస్లామాబాద్ రానున్నారు. ఇరాన్తో జరగబోయే చర్చల కోసం ఈ పర్యటనలు కీలకంగా భావించబడుతున్నాయి.
అయితే, ఇరాన్ స్పష్టమైన వైఖరిని వ్యక్తం చేస్తూ, ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాతో సమావేశం జరగదని తేల్చిచెప్పింది. దీంతో అంతర్జాతీయ స్థాయిలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రాంతీయ రాజకీయ సమీకరణాలు, భద్రతా పరిస్థితులు వచ్చే రోజుల్లో ఎలా మారతాయన్నది ఆసక్తికరంగా మారింది.
