చావు ఇంటికి పరామ్శకు వెళ్తే.. రప్పా రప్పా అంటారు.. పెళ్లి చేసుకున్న కొత్త జంటను దీవించడానికి పిలిస్తే అక్కడా అదే రప్పా రప్పా.. లొకేషన్ ఏదైనా… సందర్భం ఎలాంటిదైనా.. వన్స్ జగన్ స్టెప్ ఔట్.. రచ్చ రిపీట్స్ అనేలా సాగుతున్నాయి
వైసీపీ అధినేత పర్యటనలు. నరకడానికి మా అన్న బ్రాండ్ అంబాసిడర్ అనే రేంజ్లో వైసీపీ కార్యకర్తలు చేస్తున్న హడావుడి.. తనకు ప్లస్ అవుతుందా.. మైనస్ అవుతుందా అని.. ఇటు జగన్రెడ్డి గానీ.. ఆయన స్ట్రాటజిస్టులు గానీ.. ఆలోచిస్తున్నారా అంటే.. లేదనే అనిపిస్తుంది.
సినిమా స్టార్లు వచ్చినా ఇంత హడావుడి చేస్తారో లేదో అనే రేంజ్లో జరుగుతున్న జగన్ ఈవెంట్స్ వల్ల సామాన్య జనానికి ఒరిగేదేమైనా ఉందా అంటే.. ట్రాఫిక్ కష్టాల్లో విలవిల్లాడటం తప్ప ఇంకెలాంటి ప్రయోజనమూ లేదు.
అనంతపురం జిల్లా రాప్తాడులో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి సోదరుడి కొడుకు పెళ్లి సందర్భంగా ఇదే తంతు. జగన్మోహన్రెడ్డి హెలికాప్టర్ దిగడమే ఆసల్యం.. అప్పటికే వెయిటింగ్లో ఉన్న వైసీపీ కార్యకర్తలు ఈలలు, కేకలతో రెచ్చిపోయారు.
జగన్ కాన్వాయ్ వెంట పరుగులు పెడుతూ.. రోడ్డు మీద వెళ్తున్న వాహనాలకు అడ్డం పడుతున్నామన్న ఆలోచనే లేకుండా హడావుడి చేశారు. జగన్ రోడ్డెక్కితే.. ఆరోజంతా ట్రాఫిక్ జామ్.. ఆ రూట్లో వెళ్లే జనాలకు పట్ట పగలే చుక్కలు చూపించి.. నరకం అనుభవించేలా చేస్తున్నారు.
ఈ మధ్య జగన్ వరుసగా పెళ్లిళ్లు, రిసెప్షన్లకు అటెండ్ అవుతున్నారు. నరసాపురం మాజీ ఎమ్మెల్యే ముదునురు ప్రసాదరాజు కొడుకు పెళ్లికి భీమవరం వెళ్లారు. అక్కడ అదే రప్పా రప్పా రచ్చ. రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అర్నాథ్రెడ్డి సోదరుడు అనిల్ రెడ్డి కొడుకు వెడ్డింగ్ రిసెప్షన్లోనూ సేమ్ సీన్.
ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి కొడుకు పెళ్లికి వెళ్తే అక్కడా.. జగన్ వచ్చిన దగ్గర నుంచి వెళ్లే వరకు వైసీపీ కార్యకర్తలు పట్టపగ్గాల్లేకుండా రెచ్చిపోయారు. మొంథా తుపాను బాధితుల పరామర్శ కోసం విజయవాడ వెళ్లిన సమయంలోనూ ఇలాంటి సీన్లే కనిపించాయి.
బెట్టింగ్ బాకీలు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్న వైసీపీ నేత కుటుంబాన్ని పరామర్శించేందుకు సత్తెనపల్లి వెళ్లిన సమయంలో.. ఫ్యాన్ పార్టీ నేతలు చేసిన హడావుడితో.. వైసీపీ కార్యకర్త జగన్ కారు కిందే పడి చనిపోయారు.
2024లో ఘోర పరాజయం తర్వాత కూడా జగన్ క్రేజ్ తగ్గలేదు అని చెప్పుకోవడానికే ఎక్కడికి వెళ్లినా.. భారీ బలప్రదర్శన చేస్తున్నారని విశ్లేషకుల అభిప్రాయం. మరి ఈ రప్పా రప్పా షోలు… అభిమానుల పేరుతో చేసే స్కిట్లు.. వైసీపీ మైలేజీని ఏమేరకు పెంచాయో ఆ పార్టీ పెద్దలకే తెలియాలి.
