26.3 C
Hyderabad
September 19, 2026
ప్రత్యేకంహోమ్

భారత్ సముద్ర తీరం వద్దకు వచ్చిన ‘యుద్ధం’

#IRISDena

భారత్ కు అతిధిగా వచ్చి తిరిగి వెళుతున్న ఇరాన్ యుద్ధ నౌకపై అమెరికా జలాంతర్గామి తో శ్రీలంక తీరంలో దాడి చేసి 130 మందిని హతమార్చిన సంఘటన ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశం అయింది. ఈ సంఘటనతో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

అమెరికా సబ్‌మరైన్ దాడితో ఇరాన్ యుద్ధ నౌక మునిగిపోయిందని వార్తలు వెలువడిన ఒకరోజు తర్వాత, ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అర్గాఛీ అమెరికాపై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అంతర్జాతీయ జలాల్లో తమ నౌకపై దాడి చేయడం ఘోరమైన చర్య అని, దీనికి అమెరికా “తీవ్రంగా పశ్చాత్తాపపడే పరిస్థితి వస్తుంది” అని ఆయన సోషల్ మీడియా వేదిక X లో పేర్కొన్నారు.

ఇరాన్ విదేశాంగ మంత్రి తెలిపిన ప్రకారం, భారత నౌకాదళానికి అతిథిగా పాల్గొన్న ఫ్రిగేట్ యుద్ధనౌక IRIS Dena అంతర్జాతీయ జలాల్లో ఎలాంటి హెచ్చరిక లేకుండా దాడికి గురైంది. దాదాపు 130 మంది నావికులతో ప్రయాణిస్తున్న ఈ నౌక శ్రీలంక పశ్చిమ తీరానికి సమీపంలో మునిగిపోయిందని తెలిపారు. అమెరికా యుద్ధ కార్యదర్శి పెత్ హెగ్సే బుధవారం మాట్లాడుతూ, అమెరికా సబ్‌మరైన్ ఒక టార్పెడో ప్రయోగించి ఇరాన్ నౌకను ముంచివేసిందని ధృవీకరించారు.

అంతర్జాతీయ జలాల్లో సురక్షితంగా ఉందని భావించిన ఇరాన్ యుద్ధ నౌకను ఇండియన్ ఓషన్‌లో టార్పెడోతో ముంచివేశామని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనతో అమెరికా-ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు భారత తీరానికి దగ్గరగా చేరుకున్నాయి. ఈ దాడి ఇరాన్ తీరానికి సుమారు 4,000 కిలోమీటర్ల దూరంలో జరిగింది. ఇరాన్ క్షిపణి దాడుల భయంతో ఇప్పటికే కొన్ని అమెరికా యుద్ధ నౌకలు భారత మహాసముద్రం వైపు కదిలాయని సమాచారం.

భారతదేశం మాత్రం అమెరికా నౌకాదళానికి తమ పోర్టులను ఉపయోగించుకునే అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేసింది. దాడికి గురైన ఇరాన్ నౌక ఇటీవల విశాఖపట్నంలో జరిగిన అంతర్జాతీయ నౌకాదళ విన్యాసాలు Exercise Milanలో పాల్గొని తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ ఘటన జరిగింది.

ఫిబ్రవరి 16న విశాఖపట్నం పోర్టుకు చేరుకున్న ఈ నౌకతో పాటు ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా, రష్యా వంటి దేశాల యుద్ధనౌకలు కూడా పాల్గొన్నాయి. “United through Oceans” అనే థీమ్‌తో జరిగిన ఈ విన్యాసాలు ఫిబ్రవరి 25న ముగిశాయి. నౌక మునిగిపోయిన సమయంలో దాదాపు 130 మంది నావికులు ఉన్నట్టు సమాచారం.

శ్రీలంక నౌకాదళం అందుకున్న అత్యవసర సంకేతం మేరకు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించింది. రెండు నౌకలు, ఒక విమానాన్ని పంపి 30 మందికిపైగా నావికులను రక్షించి గాలేలోని కరపిటియా ఆసుపత్రికి తరలించారు.

Related posts

తిరుమలలో ‘కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం’

Satyam News

మమత మేనల్లుడికి ఈడీ మరో సారి సమన్లు

Satyam News

ఇరాన్ తో చర్చలకు పాక్ చేరుకున్న జేడీవాన్స్

Satyam News

పెట్రోల్ మంటలు: నేటివి కావు.. నిన్నటి జగన్ పాలన శాపాలు!

Satyam News

24న వినియోగదారుల హక్కుల దినోత్సవం

Satyam News

శ్రీశైలం నుంచి అక్రమంగా నీటిని తీసుకుంటున్న ఆంధ్ర

Satyam News

Leave a Comment