తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బుధవారం పార్టీ సంస్థాగత కమిటీలను ప్రకటించారు. ఈ నియామకాల్లో అనుభవజ్ఞులకు, యువకులకు సమ ప్రాధాన్యం కల్పిస్తూ పార్టీ బలోపేతమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఇందులో భాగంగా పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి అయిన పొలిట్ బ్యూరోలో ఎక్స్ అఫిషియో సభ్యులుగా మంత్రి నారా లోకేశ్, ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావులతో పాటు నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలును ఈ ప్రతిష్టాత్మక పదవికి ఎంపిక చేశారు. ఈ నియామకాల్లో ప్రధానంగా ప్రముఖ విద్యావేత్త, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ వంటి అగ్రనేతతో సమానంగా లావు శ్రీకృష్ణదేవరాయలుకు పొలిట్ బ్యూరోలో బాధ్యతలు అప్పగించడం ఆయన పనితీరును సూచిస్తోంది. పార్లమెంట్లో ప్రజా సమస్యలపై గళం వినిపించే సమర్థవంతమైన నేతగా గుర్తింపు పొందిన శ్రీకృష్ణదేవరాయలు సేవలను జాతీయ స్థాయిలో వినియోగించుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు.
పార్టీ బలోపేతం కోసం అంకితభావంతో పనిచేస్తున్న శ్రీకృష్ణదేవరాయలుకు ఈ కీలక పదవి దక్కడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఒక విద్యావేత్తగా, రాజకీయ నాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లావు శ్రీకృష్ణదేవరాయలు రాబోయే రోజుల్లో పార్టీ అభివృద్ధిలో మరింత కీలక పాత్ర పోషిస్తారని పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
