అధికార అహంకారంతో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు అవలంబిస్తున్న వైఖరి ఇక ఎంత మాత్రం సహించబోమని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలోని అన్ని స్థానాల నుంచి జనసేన అభ్యర్థులను నిలబెడతామని జనసేన రాష్ట్ర కార్యదర్శి, నరసరావుపేట ఇంచార్జి సయ్యద్ జిలాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
నరసరావుపేట జనసేన పార్టీ కార్యాలయంలో శనివారం 13వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పల్నాడు జిల్లా నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలతో కలిసి సయ్యద్. జిలాని జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం భారీ కేక్ కటింగ్ చేసిన సయ్యద్ జిలాని, పార్టీ శ్రేణులకు అందించారు.
పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ముఖ్యంగా వీర మహిళలు నరసరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు వైఖరిపై, టిడిపి అవలంబిస్తున్న ఒంటెద్దు పోకడలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనసేన పార్టీ మద్దతుతో గెలిచి, పొత్తు ధర్మాన్ని, కూటమి సూత్రాలను కనీసం పాటించని ఎమ్మెల్యే వైఖరిని ఖచ్చితంగా రాష్ట్ర నాయకుల దృష్టికి తీసుకుపోతామని హెచ్చరించారు.
అధికార అహంకారంతో ఎమ్మెల్యే అవలంబిస్తున్న వైఖరి ఎంత మాత్రం సహించబోమని స్పష్టం చేశారు. రాబోయే స్థానిక సంస్థలలో నియోజకవర్గంలో అన్ని స్థానానికి అభ్యర్థులను నిలబెడుతుందన్నారు.
జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయాన్ని, అవమానాలను భరించే ఓపిక సహనం తనకు లేవని ఘాటుగా వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో టిడిపి వైఖరిపై ఇప్పటికే పలుమార్లు అధినేత దృష్టికి తీసుకెళ్లామన్నారు. తమ కార్యకర్తలకు, నాయకులకు ఏవిధంగా కాపాడుకోవాలో, న్యాయం చేయాలో తమకు బాగా తెలుసన్నారు.
రాజకీయాలలో ఓనమాలు తెలియని వారికి అధికారం వస్తే ఏ విధమైన పరిస్థితి నెలకుంటుందో ప్రజలకు అర్థం అయిందన్నారు. అన్ని పదవులలోనూ నామినేటెడ్ పోస్టులలోనూ తమ పార్టీ శ్రేణులకు వాటా ఉందని, అది జనసైనికుల హక్కఉందని పరోక్షంగా ఎమ్మెల్యేని ఉద్దేశించి చెప్పారు.
ఆడిన మాట తప్పడం, సహాయం చేసిన వారిని మర్చిపోవడం, రాజకీయ కుసంస్కారమని విమర్శించారు. తీరు మార్చుకోకుంటే ఏం చేయాలో జనసేన పార్టీకి, జనసైనికులకు బాగా తెలుసన్నారు.
ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లాలోని వివిధ నియోజకవర్గాల జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
