ఏఈ నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య కేసులో కీలకపరిణామం చోటు చేసుకున్నది. నూకరాజు కుటుంబానికి చెందిన బాలుడు కార్తికేయరెడ్డి తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ను కలిసి తన కుటుంబానికి జరిగిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశాడు.
సాధిక్ వల్లే మా కుటుంబం సర్వనాశనం అయింది. నన్ను అనాథను చేశాడు అంటూ కార్తికేయరెడ్డి కన్నీటి పర్యంతమయ్యాడు. తన తండ్రి జగదీష్రెడ్డిని సాధిక్ రసాయనాలు కలిపి హత్య చేశాడని అతడు ఆరోపించాడు. ప్రొటీన్ షేక్లో విషపదార్థాలు కలిపి తన తండ్రిని చంపాడని సంచలన ఆరోపణలు చేశాడు.
అదే విధంగా తన తల్లిని సాధిక్ నిత్యం కొడుతూ, తీవ్రంగా వేధించేవాడని కార్తికేయరెడ్డి వెల్లడించాడు. ఈ విషయాలను బయటకు చెబితే తనను టెర్రరిస్టులకు అమ్మేస్తానని బెదిరించాడని ఆరోపించాడు. మూడో తరగతి నుంచే సాధిక్తో పరిచయం ఉందని, రైఫిల్ షూటింగ్ శిక్షణ సమయంలో అతడికి తన తల్లితో పరిచయం ఏర్పడిందని తెలిపాడు.
అతని వేధింపులు, బెదిరింపుల కారణంగానే తన తాత నూకరాజు, అమ్మమ్మ మీనా, తల్లి సౌజన్య గోదావరిలో దూకారని బాలుడు తెలిపాడు. ఈ ఘటనలో తాను ఒక్కడినే ప్రాణాలతో బయటపడ్డానని కన్నీటి పర్యంతమయ్యాడు. “ఇప్పుడు నాకు ఎవరూ లేరు.. బయటకు రావాలన్నా భయంగా ఉంది” అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. నిందితుడు సాధిక్కు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశాడు.
సాదిక్ కేసును సీబీఐకి అప్పగించాలని జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. నలుగురి మృతికి సాధిక్ కారణమయ్యాడని ఆయన ఆరోపించారు. సౌజన్యను శారీరకంగా, మానసికంగా వేధించాడని పేర్కొన్నారు. నిందితుడి తరఫున బార్ అసోసియేషన్ వాదించవద్దని ఆయన కోరారు. ఈ వ్యవహారంపై ప్రధాని, కేంద్ర హోంమంత్రికి లేఖ రాస్తానని వెల్లడించారు.
సౌజన్యను వివాహం చేసుకోవాలని సాధిక్ కుట్ర చేశాడని పోలీసుల రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నట్లు సమాచారం. ఆమె నుంచి డబ్బు, బంగారం, ఆస్తి పత్రాలు లాక్కొనేందుకు ప్రయత్నించాడని ఆరోపణలు ఉన్నాయి. మతం మారాలని సౌజన్యపై ఒత్తిడి తెచ్చినట్లు కూడా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నట్లు సమాచారం. గతంలో సౌజన్య భర్త జగదీష్పై కత్తితో దాడి చేసినట్లు కూడా రిమాండ్ రిపోర్టులో ఉన్నట్లు తెలుస్తోంది.
బాలుడు చేసిన ఆరోపణలు, పోలీసుల రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న అంశాలపై దర్యాప్తు కొనసాగాల్సి ఉంది. ఈ ఆరోపణల్లో వాస్తవాలు ఏమిటనేది సమగ్ర దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమయ్యే అవకాశం ఉంది.
