బ్రిటన్ యువరాణి కేథరీన్ (కేట్ మిడిల్టన్) వ్యక్తిగత వైద్య రికార్డులను అమ్మిన ఒక మాజీ ఆరోగ్య శాఖ ఉద్యోగికి బ్రిటన్ డేటా పరిరక్షణ సంస్థ అధికారిక క్రిమినల్ హెచ్చరిక జారీ చేసింది. బ్రిటన్ సమాచార కమిషనర్ కార్యాలయం (ICO) ఈ విషయాన్ని వెల్లడించింది.
2024 జనవరిలో లండన్లోని The London Clinic ఆసుపత్రిలో కేథరిన్ చికిత్స పొందుతున్న సమయంలో, కనీసం ఒక సిబ్బంది ఆమె వైద్య రికార్డులను అనుమతి లేకుండా యాక్సెస్ చేయడానికి ప్రయత్నించినట్లు గతంలో మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ ఘటనపై ఆరోపణలు వచ్చిన అనంతరం చట్ట అమలు సంస్థలు విచారణ ప్రారంభించగా, ఆసుపత్రి కూడా 2024 మార్చిలో ఈ డేటా ఉల్లంఘన విషయాన్ని సమాచార కమిషనర్ కార్యాలయానికి నివేదించింది. అనంతరం “అనుమతి లేకుండా వైద్య సమాచారాన్ని సేకరించడం మరియు మూడో వ్యక్తికి వెల్లడించేందుకు ప్రయత్నించడం”పై క్రిమినల్ దర్యాప్తు చేపట్టారు.
పూర్తి విచారణ అనంతరం లండన్కు చెందిన మాజీ ఆరోగ్య సేవల ఉద్యోగికి అధికారిక క్రిమినల్ కాషన్ (హెచ్చరిక) జారీ చేసినట్లు ఐసీఓ వెల్లడించింది. అత్యంత సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా దుర్వినియోగం చేయడంతో పాటు, ఆ సమాచారాన్ని ఆర్థిక లాభం కోసం విక్రయించేందుకు ప్రయత్నించడం నమ్మకద్రోహానికి స్పష్టమైన ఉదాహరణగా పేర్కొంది.
ప్రిన్స్ విలియమ్ సతీమణి అయిన కేథరిన్ 2024 జనవరిలో పొత్తికడుపు శస్త్రచికిత్స కోసం రెండు వారాల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. అనంతరం ఆమెకు ఒక రకమైన క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించబడగా, కీమోథెరపీ చికిత్స తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె వ్యాధి నుంచి ఉపశమనం పొందినట్లు ఇప్పటికే ప్రకటించారు.
ఈ ఘటనపై స్పందించిన ఆసుపత్రి ప్రతినిధి, ఐసీఓతో కలిసి చేసిన చర్యల వల్ల ఈ బాధాకరమైన ఘటనకు ముగింపు లభించిందని తెలిపారు. ఆసుపత్రి నియంత్రణ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. అలాగే, సంబంధిత ఉద్యోగిని విధుల నుంచి తొలగించడంతో పాటు అతని వృత్తిపరమైన అర్హతలను కూడా రద్దు చేసినట్లు బ్రిటిష్ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
ఐసీఓ రెగ్యులేటరీ సూపర్విజన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఐయాన్ హుల్మే మాట్లాడుతూ, ఆరోగ్య సేవా సంస్థలకు ప్రజలు అందించే వ్యక్తిగత సమాచారం సురక్షితంగా ఉంటుందనే నమ్మకం కలిగి ఉండాలని, ఆ నమ్మకాన్ని దెబ్బతీసే వారిపై అవసరమైతే క్రిమినల్ చర్యలు తీసుకోవడంలో ఎలాంటి వెనుకంజ ఉండదని హెచ్చరించారు.
