పల్నాడు జిల్లాలో జరుగుతున్న మెడికల్ మాఫియా అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) పల్నాడు జిల్లా సమితి ఆధ్వర్యంలో గురువారం నరసరావుపేటలోని జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కార్యాలయం సిబ్బందికి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శిలు మహంకాళి సుబ్బారావు, సుభాని మాట్లాడుతూ జిల్లాలోని హాస్పిటల్స్ మరియు కొంతమంది మెడికల్ స్టోర్లు ప్రభుత్వ నిబంధనలు పూర్తిగా ఉల్లంఘిస్తూ, ధనార్జన ధ్యేయంగా నకిలీ మందులు అమ్ముతున్నారని ఆరోపించారు. ఈ విషయం జిల్లా డ్రగ్స్ అధికారులకు తెలిసిన నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు ప్రజారోగ్యాన్ని సేవగా భావించకుండా వ్యాపారంగా మార్చి దోపిడికి పాల్పడుతున్నారని తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాల బలహీనతను ఆసరాగా చేసుకొని అవసరానికి మించిన బిల్లులు వేయటం, అవసరంలేని పరీక్షలు మరియు చికిత్సలు చేయించడం ద్వారా వారి ఆర్థిక పరిస్థితిని దెబ్బతిస్తున్నారు.
ఇక మరోవైపు జిల్లాలో కొంతమంది మెడికల్ స్టోర్లు చట్టాలను పక్కనపెట్టి ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తుమందుల విక్రయం, అనుమతి లేని అబార్షన్ మాత్రల రహస్య అమ్మకాలు, లైసెన్స్ లేకుండా మెడికల్ షాపులు నిర్వహణ వంటి అక్రమాలకు పాల్పడుతున్నారు పేర్కొన్నారు. ఈ పరిస్థితి సాధారణ ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు.
కాబట్టి ఈ సమస్యను అత్యవసరంగా పరిగణించి చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని, అధికారులను డిమాండ్ చేశారు. లైసెన్స్ లేని మెడికల్ స్టోర్లను తక్షణమే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. అన్ని మెడికల్ షాపులు, ప్రైవేట్ హాస్పిటల్స్ పై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని, అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చట్టపరమైన చర్య తీసుకోవాలని, మెడికల్ షాపులో రికార్డులు సక్రమంగా నిర్వహిస్తున్నారా అనేదానిపై అధికారులు పరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మేకపోతుల నాగేశ్వరరావు, ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు మల్లికార్జున, నాగరాజు, బొంత పృథ్వి, కె. దుర్గా, జగదీష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
