రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా మంత్రి వాకిటి శ్రీహరి అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా మక్తల్ నియోజకవర్గం కృష్ణ మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధిపై స్థానిక నాయకులతో మంత్రి వాకిటి శ్రీహరి ఈరోజు మక్తల్ క్యాంపు కార్యాలయం లో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.
సమీక్షలో ప్రతి గ్రామానికి ప్రత్యేకంగా సమయం కేటాయించిన మంత్రి శ్రీహరి…. ఆయా గ్రామాల నాయకుల నుంచి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో ఇప్పటికే పూర్తయిన అభివృద్ధి పనులు, కొనసాగుతున్న పనులు, ఇంకా చేపట్టాల్సిన పనులపై సమగ్రంగా చర్చించారు.
ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, రహదారులు, తాగునీరు, విద్య, పారిశుధ్యం తదితర అంశాలపై గ్రామాల వారీగా వివరాలు సేకరించారు. అత్యవసర సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ పరిష్కార మార్గాలను అన్వేషించారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగం పెంచడమే లక్ష్యంగా సమీక్షలు నిర్వహిస్తున్నానని మంత్రి తెలిపారు . ప్రజలకు ఇచ్చిన హామీలను కార్యరూపంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు స్పష్టం చేశారు.
రాజకీయాలకు తావులేకుండా గ్రామం ఏదైనా అభివృద్ధి ఒక్కటే అజెండాగా పని చేస్తున్నానన్నారు. కృష్ణ మండలంలోని ప్రతి గ్రామంలో ప్రజల అవసరాలను గుర్తించి దశలవారీగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. గ్రామాల సమస్యలను స్థానిక నాయకులు అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు వాటి పరిష్కారానికి సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
గ్రామం అభివృద్ధి చెందితేనే నియోజకవర్గం అభివృద్ధి చెందినట్లుగా భావిస్తూ గ్రామాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు.ఒక్కో గ్రామానికి సమయం కేటాయించి నాయకుల సమస్యలను ఓపికగా వింటూ, ఇంకా జరగాల్సిన అభివృద్ధిపై చర్చించడం ద్వారా గ్రామస్థాయిలోని సమస్యలపై తనకు స్పష్టమైన అవగాహన కల్పించుకుంటున్నట్లు తెలియజేశారు. రాబోయే రోజుల్లో అభివృద్ధి పనులకు మరింత ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.
