విజయనగరం లో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మంగళవారం ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సినీ నటుడు మోహన్ బాబు దిష్టి బొమ్మ ను దగ్దం చేశారు. విద్యార్థి సంఘం నాయకులను కిడ్నాప్ చేయించిన మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలని కోరుతూ నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఎన్.నాగభూషణం, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి.రాము మాట్లాడుతూ తిరుపతి జిల్లాల్లో ఉన్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీలో తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని అనేక మార్లు విద్యార్థి సంఘాలు ఆందోళన చేసిన సందర్భంలో ఉన్నత విద్యా మండలి స్పందించి అక్రమంగా తల్లిదండ్రుల నుంచి వసూలు చేసిన 26 కోట్ల రూపాయలు తిరిగి తల్లిదండ్రులకు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
అలాగే అక్రమాలకు పాల్పడినందుకు 16 లక్షల రూపాయలు జరిమానా విధించింది. అయినా సరే మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం తల్లిదండ్రుల నుంచి మళ్లీ అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఈరోజు తిరుపతి జిల్లాలో ఏఐఎస్ఎఫ్ ,ఎస్ఎఫ్ఐ కలెక్టరేట్ వద్ద నిరసన తెలియజేస్తుంటే మోహన్ బాబు బౌచర్ల పేరుతో ఉన్న రౌడీలు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్ ,నాయకుడు వినోదును కిడ్నాప్ చేయడం జరిగిందని దీనిపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, హోంమినిస్టర్ వంగలపూడి అనిత స్పందించి మోహన్ బాబు, తన బౌంచర్లపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు
ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతుంటే విద్యార్థి సంఘం నాయకులను కిడ్నాప్ చేయడం సిగ్గుచేటని మోహన్ బాబు యూనివర్సిటీ పై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో అన్ని విద్యార్థి యువజన సంఘాలు కలుపుకొని భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గౌరీ శంకర్ జిల్లా ఉపాధ్యక్షులు సుమన్, చరణ్ ఎస్ ఎఫ్ ఐ జిల్లా నాయకులు శిరీష,భారతి,రూప,వంశి, రమణ,సూరిబాబు,జయ తదితరులు పాల్గొన్నారు.
