మున్నేరు–పాలేరు గ్రావిటీ లింక్ పథకం ద్వారా సాగునీటి రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ పథకానికి ప్రభుత్వం రూ.162.57 కోట్లను కేటాయించిందని ఆయన వెల్లడించారు. ఈ గ్రావిటీ లింక్ పథకం ద్వారా 50 టీఎంసీల నీటిని మున్నేరు నుంచి పాలేరు రిజర్వాయర్కు మళ్లించనున్నట్లు మంత్రి తెలిపారు. దీని వల్ల ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లోని మొత్తం 1.38 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటి స్థిరీకరణ జరుగుతుందని చెప్పారు.
పాలేరు రిజర్వాయర్ ఎగువ భాగంలో ఉన్న 40 వేల ఎకరాల ఎన్ఎస్పీ (నాగార్జున సాగర్ ప్రాజెక్ట్) ఆయకట్టుకు పూర్తి భరోసా లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు. అలాగే శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ స్టేజ్–2 ఆయకట్టుకు కూడా అదనపు ప్రయోజనం చేకూరనుందని తెలిపారు. భక్త రామదాసు ఎత్తిపోతల పథకం కింద డీబీఎం–60 ద్వారా 76,308 ఎకరాల ఆయకట్టుకు అదనపు నీరు అందుతుందని, సూర్యాపేట జిల్లా మోతే ఎత్తిపోతల పథకం పరిధిలోని 46,712 ఎకరాల ఆయకట్టుకు సమృద్ధిగా సాగునీరు లభిస్తుందని మంత్రి వివరించారు.
ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి ఏడాది సుమారు రూ.120 కోట్ల విద్యుత్ ఖర్చులు ఆదా అవుతాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. అదనపు నీటి లభ్యతతో పాలేరు రిజర్వాయర్లోని హైడల్ ప్లాంట్ ద్వారా 2 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కూడా అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. అంతేకాకుండా, ఆకస్మిక వరదల కారణంగా జరిగే నష్టాలకు ఈ పథకం ద్వారా చెక్ పడుతుందని మంత్రి స్పష్టం చేశారు. మున్నేరు–పాలేరు గ్రావిటీ లింక్ పథకం పూర్తయ్యాక రైతులకు సాగునీటి సమస్య శాశ్వతంగా తీరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
