కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి పార్వేటి ఉత్సవం మకర సంక్రమణకు మరుసటి రోజున అనగా కనుమ పండుగనాడు తిరుమలలో అత్యంత ఘనంగా జరిగింది. గురువారం స్వామివారికి ప్రాతఃకాలారాధన పూర్తి అయిన తరువాత శ్రీమలయప్పస్వామివారు తిరుచ్చిలో వేంచేసారు.
వారి వెంటనే మరో తిరుచ్చిపై శ్రీ కృష్ణస్వామి వేంచేసారు. అనంతరం పార్వేట మండపమునకు వెళ్ళి, ఆ మండపమునందు పుణ్యాహవచనం జరిగిన పిమ్మట మంచెలో వేంచేసారు. శ్రీస్వామివారికి ఆరాధనము, నివేదనం తర్వాత హారతులు జరిగాయి. అనంతరం ఉభయదార్లకు తాళ్ళపాక వారికి, మఠంవారికి మర్యాదలు, స్వామివారు మండపమును వదలి ప్రాంగణమునకు వచ్చారు.
శ్రీకృష్టస్వామివారిని మాత్రం సన్నిధి గొల్లపూజ చేసిన చోటుకు వేంచేపుచేసి పాలువెన్న ఆరగింపు అయి హారతి జరిగిన తర్వాత శ్రీమలయప్పస్వామివారి సన్నిధికి వెళ్ళారు. తరువాత ఆ గొల్ల సమర్పించిన పాలు వెన్న శ్రీమలయప్ప స్వామి వారికి నివేదనం హారతి అయి గొల్లకు బహుమానం ఇచ్చారు. తరువాత శ్రీమలయప్పస్వామివారు ముందునకు కొంత దూరం పరుగెత్తి వారి తరపున అర్చకులు బాణం వేసిన పిమ్మట వెనుకకు వచ్చారు.
ఇలా మూడుసార్లు జరిగింది. స్వామివారి వేటను తిలకించడానికి పారువేట మండపానికి వేలాదిగా భక్తులు విచ్చేసారు. శ్రీమలయప్పస్వామివారు ఉత్సవము పూర్తియి మహాద్వారమునకు వచ్చి హత్తీరాంజీవారి బెత్తంను తీసుకొని సన్నిధిలోనికి వేంచేసారు. ఇంతటితో ఎంతో వేడుకగా జరిగే పారువేట ఉత్సవం ఘనంగా ముగిసింది. ఈ ఉత్సవంలో టిటిడి ఈవో అనిల్కుమార్ సింఘాల్, ఆలయ ఉపకార్యనిర్వహణాధికారి హరీంద్రనాధ్, శ్రీ బోక్కసం సెల్ ఇన్చార్జ్ గురురాజస్వామి, ఇతర ఉన్నతాధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.