సంపాదకీయంహోమ్

ఢిల్లీలో లోకేష్‌ మార్క్‌…. యువనేతకి కీలక ఆహ్వానం….!

#NaraLokeshDelhi

ఢిల్లీ వేదికగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు గమనిస్తే NDA కూటమిలో అటు కేంద్ర అగ్రనేతలకు, ఇటు తెలుగుదేశం పార్టీకి మధ్య నారా లోకేష్ బలమైన వారధిగా మారుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇటీవల కాలంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి బదులుగా లోకేషే ఎక్కువగా ఢిల్లీ పర్యటనలు చేపడుతున్నారు. కేవలం రాష్ట్ర వ్యవహారాలకే పరిమితం కాకుండా, జాతీయ రాజకీయాల్లోనూ పూర్తిస్థాయిలో నిమగ్నమవుతుండటం ఇప్పుడు హస్తినలో హాట్ టాపిక్‌గా మారింది.

రాష్ట్రంలో ఐటీ, విద్యాశాఖల బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూనే.. జాతీయ స్థాయిలో చక్రం తిప్పే వ్యూహాన్ని లోకేష్ అమలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు రాష్ట్ర పరిపాలనపై దృష్టి సారించిన నేపథ్యంలో, జాతీయ రాజకీయాల పర్యవేక్షణ బాధ్యతను లోకేష్ భుజాన వేసుకున్నట్లు కనిపిస్తోంది. కేంద్రంలో కూటమి ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న బీజేపీ అగ్రనాయకత్వంతో పాటు, ఎన్డీఏలోని ఇతర భాగస్వామ్య పక్షాల నేతలతో కూడా లోకేష్ నిరంతరం టచ్‌లో ఉంటున్నారు. జాతీయ స్థాయిలో తీసుకునే కీలక నిర్ణయాల్లో టీడీపీ తరఫున ఆయన క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పుస్తకావిష్కరణ కార్యక్రమం లోకేష్ జాతీయ స్థాయి ప్రాధాన్యతను మరోసారి చాటిచెప్పింది. ఈ వేదికపై దేశ మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ, కేంద్ర మంత్రులు హెచ్.డి. కుమారస్వామి, జ్యోతిరాదిత్య సిందియా వంటి సీనియర్ నేతలతో లోకేష్ చాలా ఆత్మీయంగా గడిపారు. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా దేశంలోని ప్రముఖ రాజకీయ శక్తులతో ఆయన వ్యక్తిగత సత్సంబంధాలను బలోపేతం చేసుకుంటున్నారు. ఈ పరిణామాలు లోకేష్ పొలిటికల్ మెచ్యూరిటీకి, దేశ రాజకీయాలపై ఆయనకు వస్తున్న పట్టుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

చంద్రబాబు వారసుడిగా కేవలం ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కాకుండా..జాతీయ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పగల సమర్థుడైన నేతగా లోకేష్ తనను తాను ఆవిష్కరించుకుంటున్నారు. ఎన్డీఏ కూటమిలో టీడీపీ అత్యంత కీలక భాగస్వామిగా ఉన్న ఈ తరుణంలో, ఢిల్లీ స్థాయిలో లోకేష్ చూపిస్తున్న చొరవ, నెరపుతున్న దౌత్యం భవిష్యత్తులో దేశ రాజకీయాల్లో ఆయనన నెక్స్ట్ జనరేషన్ పవర్‌ఫుల్ లీడర్‌గా నిలబెట్టబోతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Related posts

అణు పరీక్షలకు సిద్ధమైన పాకిస్తాన్?

Satyam News

వైద్య హబ్‌గా తెలంగాణ : స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

Satyam News

మహిళా అధికారిని బ్లాక్ మెయిల్ చేసిన జర్నలిస్టులు

Satyam News

ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పిస్తున్న ప్రభుత్వం

Satyam News

ఇక టార్గెట్ టెహరాన్: యుద్ధం తీవ్రతరం

Satyam News

ప్రభుత్వ బడుల్లో విద్య మరింత బలోపేతం

Satyam News

Leave a Comment