ఏపీకి పెట్టుబడులు క్యూ కడుతున్నాయి. ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అనే తేడా లేకుండా అన్ని జిల్లాలకు కూటమి ప్రభుత్వం సమ ప్రాధాన్యత ఇస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏజెన్సీ ప్రాంతాలకు గేట్ వేలాంటి నర్సీపట్నం నియోజకవర్గానికి కూడా భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ఈ నియోజకవర్గానికి స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అనకాపల్లి జిల్లా కేంద్రానికి 41 కి.మీటర్లు, విశాఖకు 72 కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్సీపట్నం ఇప్పుడు ఇండస్ట్రీయల్ హబ్గా మారబోతుంది.
తాజాగా నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం దగ్గర ఎర్త్ మూవర్స్’ యంత్రాలు, వాటి విడిభాగాలు తయరుచేసే పరిశ్రమ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ మేరకు ఝార్ఖండ్లోని ధన్బాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ‘డోజ్కో ప్రైవేటు లిమిటెడ్’ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం MOU చేసుకుంది. 100 ఎకరాల విస్తీర్ణంలో రూ.1,234 కోట్ల పెట్టుబడితో ఏర్పాటయ్యే ఈ కంపెనీ నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేయనున్నట్టు తెలిసింది.
ఈ మేరకు ఆ కంపెనీ ప్రతినిధులు స్థానిక ఎమ్మెల్యే, స్పీకర్ అయ్యన్నపాత్రుడిని కలిశారు. మరోవైపు కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్రపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా విశాఖను ఆర్థిక, ఐటీ రాజధానిగా అభివృద్ధి చేస్తూ, ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు మరియు పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తోంది.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, విశాఖ ఉక్కు కర్మాగారానికి పునరుద్ధరణ ప్యాకేజీ, సౌత్ కోస్టల్ రైల్వే జోన్ లాంటి ప్రాజెక్టులను తీసుకువచ్చింది. ఇక, NTPC గ్రీన్ హైడ్రోజన్ హబ్ వంటి దిగ్గజ సంస్థల పెట్టుబడులకు ఇప్పటికే శంకుస్థాపనలు జరిగాయి. అనకాపల్లి జిల్లాలో త్వరలో భారీ లాజిస్టిక్ హబ్కు శంకుస్థాపన జరగనుంది. దీంతో పాటు జిల్లాల్లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయి. ఇక, అచ్యుతాపురం వంటి ప్రాంతాల్లో ఉన్న సెజ్లలో భారీగా పరిశ్రమలు రానున్నాయి.
