పాత మంగళగిరి హిందూ శ్మశానవాటికకు ఆధునిక రూపు తీసుకువస్తూ రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారించారు. మంగళగిరి నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న మంత్రి లోకేష్, ప్రజల ప్రాథమిక అవసరాలకు అనుగుణంగా శ్మశానవాటికల అభివృద్ధిని ప్రాధాన్యతగా తీసుకున్నారు.
నియోజకవర్గంలోని శ్మశానవాటికల పరిస్థితులు దయనీయంగా ఉండటంతో వాటి రూపురేఖలు మార్చేందుకు స్వంత నిధులతో పాటు వివిధ సంస్థల సహకారంతో ఆధునిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే కొన్ని శ్మశానవాటికలు పూర్తికాగా, మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి.
ఈ క్రమంలో పాత మంగళగిరిలోని హిందూ శ్మశానవాటికను పూర్తిగా ఆధునికీకరించేందుకు ఫీనిక్స్ గ్రూప్ నుంచి రూ.3 కోట్ల సీఎస్ఆర్ నిధులు మంజూరు చేయించారు. ప్రస్తుతం పునర్నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. పనులు పూర్తయిన అనంతరం ఈ మహాప్రస్థానం ప్రజలకు పరిశుభ్రమైన, ప్రశాంతమైన, గౌరవప్రదమైన అంతిమ వీడ్కోలు కేంద్రంగా నిలవనుంది.
సుమారు రెండెకరాల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న ఈ మహాప్రస్థానంలో నాలుగు చితులు, వేచి ఉండే గదులు, అన్నదాన హాల్, పురుషులు-మహిళల కోసం ప్రత్యేక వాష్రూములు, మార్చురీ, విస్తారమైన వాహన పార్కింగ్, చెక్క నిల్వ కేంద్రం, కర్మకాండల గదులు, పక్షులకు ఆహార ప్రదేశం, అందమైన ల్యాండ్స్కేపింగ్, అంతర్గత రహదారులు వంటి ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు.
పర్యావరణ హితంగా రూపుదిద్దుకుంటున్న ఈ శ్మశానవాటిక కుటుంబ సభ్యులకు ఓదార్పునిచ్చే వాతావరణాన్ని కల్పిస్తూ, తమ ప్రియమైనవారికి గౌరవప్రదమైన అంతిమ వీడ్కోలు పలికేలా ప్రత్యేకంగా నిర్మిస్తున్నారు. పనులు పూర్తయిన తర్వాత ఇది మంగళగిరి ప్రజలు గర్వంగా చెప్పుకునే స్థాయిలో నిలవనుంది. మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతి రంగంలో ప్రత్యేక ముద్ర వేస్తూ ప్రజలకు అవసరమైన సదుపాయాలను అందించడంలో మంత్రి లోకేష్ కృషి చిరస్మరణీయమని పుర ప్రజలు అభినందిస్తున్నారు.
