జీహెచ్ఎంసీ పునర్విభజన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిని రీషఫిల్ చేస్తూ మొత్తం 12 జోన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఈ కొత్త విధానం ప్రకారం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి శంషాబాద్, రాజేంద్రనగర్ జోన్లు వచ్చి చేరాయి. దీనివల్ల శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇకపై హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి వస్తుంది. హైదరాబాద్ కమిషనరేట్లో చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, రాజేంద్రనగర్, సికింద్రాబాద్, శంషాబాద్ జోన్లు ఉండనున్నాయి.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనూ కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇక్కడ శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ జోన్లను ఏర్పాటు చేశారు. శేరిలింగంపల్లి జోన్ పరిధిలోకి మొయినాబాద్ నుండి పటాన్చెరు వరకు ఉన్న ప్రాంతాలు రాగా, కూకట్పల్లి జోన్ పరిధిలోకి మాదాపూర్ ప్రాంతాన్ని చేర్చారు.
అలాగే రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఎల్బీనగర్, మల్కాజిగిరి, ఉప్పల్ జోన్లు కొనసాగనున్నాయి.మరోవైపు, యాదాద్రి జిల్లాను ప్రత్యేక పోలీస్ జిల్లాగా మార్చడంతో పాటు, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్ సిటీ కోసం కొత్త పోలీస్ కమిషనరేట్ ఏర్పాటుపై కసరత్తు జరుగుతోంది.
మహేశ్వరం జోన్, షాద్ నగర్, చేవెళ్ల ప్రాంతాలను కలుపుతూ ‘ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్’ను ఏర్పాటు చేసే యోచనలో పోలీస్ శాఖ ఉన్నట్లు సమాచారం.
