డచ్కు చెందిన విలాసవంతమైన సముద్ర నౌక ఎంవీ హోండియస్లో హాంటా వైరస్ వ్యాప్తి కలకలం రేపుతోంది. ఈ నౌకలో ఇప్పటివరకు ఐదు హాంటా వైరస్ కేసులు నిర్ధారణ కాగా, ముగ్గురు మరణించినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. ఈ నౌక సిబ్బందిలో ఇద్దరు భారతీయులు కూడా ఉన్నట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది.
ఓషన్వైడ్ ఎక్స్పెడిషన్స్ సంస్థ నిర్వహిస్తున్న ఈ విలాసవంతమైన సముద్ర యాత్ర నౌక ఏప్రిల్ 1న అర్జెంటీనాలోని ఉషువాయా నుంచి బయలుదేరింది. మే 10న స్పెయిన్కు చెందిన కానరీ దీవులకు చేరుకోనుంది. ప్రారంభ సమయంలో ఈ నౌకలో 28 దేశాలకు చెందిన సుమారు 150 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు.
ప్రయాణ మధ్యలో సెయింట్ హెలెనా దీవిలో పలువురు ప్రయాణికులు దిగిపోయినట్లు వెల్లడైంది. వారిలో బ్రిటన్కు చెందిన ఏడుగురు ఉన్నారు. అలాగే ఒక మరణించిన వ్యక్తి మృతదేహాన్ని కూడా నౌక నుంచి దించారు. ప్రస్తుతం ఆ దీవిలో దిగిపోయిన వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్య అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు.
నౌకలో ఉన్న వారిలో ఫిలిప్పీన్స్కు చెందిన 38 మంది, బ్రిటన్కు చెందిన 31 మంది, అమెరికాకు చెందిన 23 మంది, నెదర్లాండ్స్కు చెందిన 16 మంది, స్పెయిన్కు చెందిన 14 మంది, జర్మనీకి చెందిన 9 మంది, కెనడాకు చెందిన 6 మంది ఉన్నారు. భారతదేశానికి చెందిన ఇద్దరు సిబ్బంది కూడా నౌకలో ఉన్నట్లు సమాచారం.
మరణించిన వారి ప్రత్యేక లక్షణాలపై విచారణ
ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, అనుమానిత ఎనిమిది కేసుల్లో ఐదు కేసులు హాంటా వైరస్గా నిర్ధారణ అయ్యాయి. వైరస్ బారిన పడి మరణించిన వారిలో 69 ఏళ్ల డచ్ మహిళ, ఆమె భర్త, జర్మనీకి చెందిన మరో మహిళ ఉన్నారు. వీరి మరణాలపై ప్రత్యేక దర్యాప్తు కొనసాగుతోంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటువ్యాధుల నిపుణురాలు మారియా వాన్ కెర్కోవ్ మాట్లాడుతూ, ఇది కరోనా మహమ్మారి తరహా పరిస్థితి కాదని స్పష్టం చేశారు. హాంటా వైరస్ అత్యంత సన్నిహిత సంబంధాల ద్వారా మాత్రమే వ్యాపిస్తుందని తెలిపారు. నౌకలో ఉన్న వారందరికీ మాస్కులు ధరించాలని సూచించినట్లు వెల్లడించారు. అనుమానిత రోగులను చూసుకునే వారు మరింత రక్షణ పరికరాలు వినియోగించాలని సూచించారు.
సాధారణంగా హాంటా వైరస్ ఎలుకల ద్వారా వ్యాపిస్తుంది. అయితే ఈ ఘటనలో మనుషుల మధ్య వ్యాప్తి నమోదవడం వైద్య వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో తాజాగా నౌక నుంచి దిగిపోయిన వారిని గుర్తించి పరీక్షలు నిర్వహించేందుకు ఆరోగ్య శాఖ అధికారులు వేగంగా చర్యలు చేపట్టారు.
