రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు నిర్ణయించి ప్రజా దర్భార్లను ఏర్పాటు చేస్తున్నామని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు.అన్నిచోట్ల త్రాగునీరు, విద్యుత్ ,ధరణి వంటి సమస్యలు ఉన్నాయి. వీటిని పరిష్కరించేందుకు గాను పాలేరు నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా ఎంచుకున్నామని తర్వాతికాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని వెల్లడించారు.
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పాలేరు నియోజకవర్గంలో వినూత్నంగా చేపట్టిన ‘ప్రజా దర్బార్’ కార్యక్రమాన్ని శనివారం రాయిగూడెం క్లస్టర్ పరిధిలో నిర్వహించారు. రాయిగూడెం, అజయ్తండా, చెరువుమాదారం, మంగాపురం తండా, అప్పలనరసింహపురం, బుద్ధారం, కట్టుకాచారం, కొంగర, రాజారాంపేట, భైరవునిపల్లి గ్రామ పంచాయతీలకు చెందిన ప్రజలతో మంత్రి పొంగులేటి ముఖాముఖి భేటీ అయ్యారు.
ఈసందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు ఇటువంటి దర్బార్లను నిర్వహించడానికి ప్రధాన కారణం ప్రజా విశ్వాసాన్ని చూరగొనడమే. వారి సమస్యలను తీర్చడమే. పల్లెలు, తండాలు, గ్రామాలు ఇలా అన్ని స్ధాయిల్లో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సమస్యలను అక్కడికక్కడే తీర్చే కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. కొన్ని సమస్యలు వెంటనే పరిష్కరించవచ్చు. మరికొన్నింటికి వారం, నెల, లేదా మూడు నెలలు పట్టవచ్చు. అయితే సమస్యలను కూడా గుర్తించే కార్యక్రమం జరుగుతోందన్నారు.
గత ప్రభుత్వ హయాంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. అందుకే ప్రజా ప్రభుత్వం వచ్చిన మూడు నెలలకే అధికారులను ప్రజల వద్దకు పంపించే కార్యక్రమం చేపట్టాం.ప్రజలకు సంబంధించిన సమస్యలపై ఎవరైనా ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు. ఏ పార్టీకి చెందిన వ్యక్తి అని చూడం .అక్కడ కేవలం సమస్య పరిష్కారమే ప్రధానం. పార్టీలు కేవలం ఎన్నికల వరకే. ఆతర్వాత ప్రజా సేవే ముఖ్యం.గత ప్రభుత్వం ఆర్ధిక సంక్షోభాన్ని సృష్టించినా ఇప్పుడు ఇందిరమ్మ ప్రభుత్వం రోజు రోజుకూ ఆర్ధికంగా అభివృద్ది చెందుతోంది. అధికారంలో ఎవరున్నా ప్రజా సమస్యలను తీర్చడమే పార్టీల ప్రధాన కర్తవ్యం కావాలి. దీనికోసం ప్రతిచోట సమావేశం జరగాలి. అది ఆ గ్రామానికి, ప్రాంతానికి ఉపయోగపడాలని అన్నారు.
గతంలో ప్రజలు తమ గోడు చెప్పుకోవడానికి సరైన వేదిక లేక ఇబ్బందులు పడ్డారని, కానీ నేడు అధికారులే ప్రజల వద్దకు వచ్చి సమస్యలు వింటున్నారని మంత్రి తెలిపారు. “ఇది కేవలం ఒక రోజు కార్యక్రమం కాదు, నిరంతరం జరిగే ప్రక్రియ. మీ కష్టాలను వినే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఉంది కాబట్టే ధైర్యంగా మీ మధ్యకు రాగలుగుతున్నాం” అని ఆయన పేర్కొన్నారు.
ప్రజా దర్బార్ను కేవలం సభలా కాకుండా, ప్రతి పంచాయతీకి ఒక క్లాస్రూమ్ కేటాయించి అధికారులను కూర్చోబెట్టడం ద్వారా సమస్యలను లోతుగా అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. స్పాట్లోనే పరిష్కరించే వీలున్న సమస్యలను వెంటనే తేల్చేయాలంటూ అధికారులకు సూచించామన్నారు.
ఈనెల 27వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ, హౌసింగ్ శాఖలపై కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి సమస్యలను పారదర్శకంగా, వడివడిగా పరిష్కరించి ప్రజలకు మేలు చేకూరుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు, వివిధ శాఖల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు.
