ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో శుక్రవారం మహాపచారం జరిగింది. ఇందాపూర్ డెయిరీ నెయ్యి అంశంపై చర్చ జరగాలని పట్టుబట్టిన వైసీపీ సభ్యులు, శ్రీ వేంకటేశ్వరస్వామి ఫోటోలతో నిరసనకు దిగి సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. సభలో దేవుడి ఫోటోలను పట్టుకున్న సమయంలో..సభ్యులు కాళ్లకు బూట్లు, చెప్పులు వేసుకుని ఉండటంపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.
అసలేం జరిగింది..!
వైసీపీ సభ్యులు వాయిదా తీర్మానం కోరుతూ పోడియంను చుట్టుముట్టారు. అయితే, దేవుడి ఫోటోలను అగౌరవపరిచేలా బూట్లు వేసుకుని నిరసన తెలపడంపై మంత్రి పయ్యావుల కేశవ్ సహా అధికార పక్ష సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు.
దేవుడంటే వైసీపీకి భక్తి, గౌరవం లేవని, ఇది ముమ్మాటికీ హిందూ మనోభావాలను దెబ్బతీయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, వైసీపీ తీరును తప్పుబట్టారు.
ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో పూజలు, సంప్రోక్షణ చేయాలని నిర్ణయించింది. అలాగే, ఈ అంశంపై స్వామీజీలు, పీఠాధిపతులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా నిర్వహించబోతున్నారు.
మరోవైపు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. వైసీపీ నేతలు చెప్పులు వేసుకుని ఫోటోలు పట్టుకున్నట్లు వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ..చెప్పులు వేసుకోలేదని, ఆ విషయాన్ని నిరూపించాలంటూ సవాల్ విసురుతున్నారు. మొత్తంగా వైసీపీ నేతల తీరు మరోసారి వివాదాస్పదంగా మారింది.
