తృణమూల్ కాంగ్రెస్ చీలిపోయింది… శివసేన చీలిపోయింది…. ఇప్పుడు సమాజ్ వాదీ పార్టీ వంతు వచ్చినట్లు కనిపిస్తున్నది. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలకు ఇది సంకేతంగా కనిపిస్తున్నది. ఇప్పుడు సమాజ్ వాదీ పార్టీలో చీలిక సంభవించే అవకాశం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఓ ప్రకాశ్ రాజ్ భర్.
బుధవారం మీడియాతో మాట్లాడిన రాజ్భర్, సమాజ్వాదీ పార్టీలో పెద్ద ఎత్తున విభజన జరగబోతోందని అన్నారు. పార్టీ సీనియర్ నేత రామ్ గోపాల్ యాదవ్ ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు లేఖ సమర్పించారని ఆయన పేర్కొన్నారు.
గోమతి రివర్ఫ్రంట్ ప్రాజెక్టు, గనుల కుంభకోణాల వెనుక అసలు సూత్రధారి ఎవరో ఉత్తరప్రదేశ్ ప్రజలకు తెలుసని రాజ్భర్ ఆరోపించారు. ఈ వ్యవహారాల్లో దర్యాప్తు ఉచ్చు బిగుస్తుండటంతో సమాజ్వాదీ పార్టీ నాయకత్వం ఆందోళన చెందుతోందని వ్యాఖ్యానించారు.
మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాజకీయ పరిణామాలను పక్కన పెడితే, సమాజ్వాదీ పార్టీలోని పలువురు నేతలు భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కూడా ఆయన పేర్కొన్నారు. లోక్సభలో రెండు మూడొంతుల మెజారిటీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఎన్డీఏ కూటమి పనిచేస్తోందని, పెండింగ్లో ఉన్న డీలిమిటేషన్ బిల్లును ఆమోదించేందుకు ఆ సంఖ్యాబలం అవసరమని అన్నారు.
అదే సమయంలో మహిళలకు లోక్సభ, రాష్ట్ర శాసనసభల్లో 33 శాతం రిజర్వేషన్ అమలుకు డీలిమిటేషన్ ప్రక్రియ కీలకంగా మారనున్న నేపథ్యంలో రాజ్భర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే సమాజ్వాదీ పార్టీ నుంచి ఈ ఆరోపణలపై ఇప్పటివరకు అధికారిక స్పందన వెలువడలేదు.
