జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు, విద్యుత్ మీటర్ల కొనుగోలులో భారీ కుంభకోణం జరిగింది. ఈ కుంభకోణం బయటపడటంతో ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారు.
ఏపీఎస్పీడీసీఎల్ (ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్)లో భారీ అవినీతి, టెండర్ల మోసాలపై రిటైర్డ్ ఐపిఎస్ అధికారి, సెంటర్ ఫర్ లిబర్టీ అధ్యక్షుడు ఏబీ వెంకటేశ్వరరావు ఏపీఎస్పీడీసీఎల్ ఛైర్మన్ మరియు సీఎండీ శివశంకర్ను విజయవాడలోని కార్యాలయంలో కలిసి ఈ కుంభకోణంపై వినతిపత్రం సమర్పించారు.
ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ మీటర్లు, కేబుల్లు, ఎలక్ట్రిక్ సప్లయిల కొనుగోళ్లలో టెండర్ ప్రక్రియలను తప్పుగా అమలు చేసి కోట్ల రూపాయల అవినీతి జరిగిందని వివరించారు. వైసీపీ ప్రభుత్వ కాలంలో కంపెనీకి చెందిన కొందరు ఉన్నతాధికారులు రాజకీయ నాయకుల ప్రభావంలో ఉండి, పలు ప్రాజెక్టులలో అధిక ధరలతో కాంట్రాక్టులు కేటాయించారని పేర్కొన్నారు.
ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, “గత ప్రభుత్వ కాలంలో అప్పటి సీఎండీ సంతోష్రావు పూర్తిగా వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారు. ఆయన పలు కాంట్రాక్టర్లతో చేతులు కలిపి విద్యుత్ పరికరాల కొనుగోళ్లలో భారీ అవినీతి జరిపారు. 2023లోనే కోట్ల రూపాయల అవినీతి బయటపడింది. మేము దానికి సంబంధించిన ఆధారాలు సేకరించి ప్రస్తుత సీఎండీకి అందజేశాం” అని తెలిపారు.
ఆ ఆధారాల ఆధారంగా ఏపీఎస్పీడీసీఎల్ ఛైర్మన్ శివశంకర్ తక్షణ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ప్రారంభ దశలో గూడూరు స్టోర్స్ ఏఈ మల్లికార్జున, ఈఈ శంకరయ్యలను సస్పెండ్ చేయగా, నెల్లూరు సర్కిల్ ఆఫీస్లో పనిచేస్తున్న విద్యుత్ ఉద్యోగి బాలచంద్రకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు.
శివశంకర్ మాట్లాడుతూ, “ఏ అవినీతి అయినా సహించం. ఎవరైనా బాధ్యులు తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజల సొమ్ము ఒక్క రూపాయి కూడా వృథా కావొద్దు” అని స్పష్టం చేశారు. సెంటర్ ఫర్ లిబర్టీ సభ్యులు సమర్పించిన ఫిర్యాదులో 2020–2023 మధ్య కాలంలో విద్యుత్ పరికరాల కొనుగోళ్లలో రూ.2,000 కోట్లకు పైగా అవినీతి జరిగిందని వివరించారు.
కొందరు కాంట్రాక్టర్లు ఒకే కుటుంబ సభ్యుల పేర్లతో వేర్వేరు కంపెనీలు నమోదు చేసుకుని, టెండర్లను తమకే కేటాయించుకున్నారని కూడా పేర్కొన్నారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో ఏపీఎస్పీడీసీఎల్ లో అంతర్గతంగా ప్రత్యేక ఆడిట్ బృందం ఏర్పాటు చేసి అన్ని టెండర్లను మళ్లీ పరిశీలించేందుకు నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో జరిగిన అవినీతిపై ఇప్పుడు ప్రభుత్వం తీవ్రంగా స్పందించగా, ఈ చర్యలు మరిన్ని కీలక విషయాలను వెలుగులోకి తెచ్చే అవకాశముందని సమాచారం.
