సింగూర్ ప్రాజెక్ట్ రిపేర్ల కోసం నీటిని ఖాళీ చేసిన తరుణాన్ని ఆసరాగా చేసుకుని, వటపల్లి మండలం కాదిరాబాద్ శివారులోని ముంపు ప్రాంతం (FTL) పరిధిలో మంత్రి దామోదర రాజనర్సింహ బావమరిది అనిల్ రెడ్డి చేస్తున్న అక్రమ ఆక్రమణలు, చెరువు కట్టల ధ్వంసం, అక్రమ విద్యుత్ లైన్ల ఏర్పాటుపై తక్షణ విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆందోల్, మాజీ ఎం ఎల్ ఏ, క్రాంతి కిరణ్ డిమాండ్ చేశారు. అధికార బలంతో, ప్రభుత్వ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తూ జరుగుతున్న భారీ భూఆక్రమణలు, పర్యావరణ విధ్వంసాన్ని దృష్టి సారించాలని కలెక్టర్ ను ఆయన కోరారు.
సింగూర్ ప్రాజెక్ట్ రిపేర్ల (మరమ్మత్తుల) కోసం అధికారులు నీటిని పూర్తిగా ఖాళీ చేయడాన్ని ఆసరాగా చేసుకుని, మంత్రి దామోదర రాజనర్సింహ బావమరిది అనిల్ రెడ్డి ముంపు ప్రాంతంలోని వందల ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు. కాదిరాబాద్ మరియు సాయిపేట్ శివారులో “పొలం” పేరుతో ఇప్పటికే 70 ఎకరాల భూమి కలిగిన ఆయన, ఇప్పుడు టూరిజం రిసార్ట్, బోటింగ్ వ్యాపారం పేరిట అక్రమాలకు పాల్పడుతున్నారు.
తన వ్యాపార స్వార్థం కోసం అనిల్ రెడ్డి మరియు ఆయన అనుచరులు ప్రాజెక్ట్ Full Tank Level (FTL) పరిధిలోకి వచ్చే భూమిని భారీ యంత్రాలతో చదును చేశారు. అత్యున్నత న్యాయస్థానాల ఆదేశాల ప్రకారం పర్యావరణ పరిరక్షణ చట్టం కింద నీటి వనరుల ఎఫ్.టి.ఎల్ పరిధిలో ఎలాంటి ఆక్రమణలు లేదా భూస్వరూపాన్ని మార్చే పనులు చేయడం పూర్తిగా నిషేధం మరియు శిక్షార్హమైన నేరం. అంతేకాకుండా సదరు వ్యక్తి తన ఫార్మ్ హౌస్ నుంచి లోపలికి సుమారు ఒక కిలోమీటర్ దూరం వరకు బండరాళ్లతో నింపి, దానిపై మట్టితో అక్రమంగా రోడ్డు వేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ సహజసిద్ధంగా ఉన్న కోరివికుంట, నల్లకుంటా చెరువుల కట్టలను పూర్తిగా తవ్వి, చేరపేశారు.
ఇది ‘తెలంగాణ నీరు, భూమి మరియు వనరుల పరిరక్షణ చట్టం’ (WALTA Act, 2002) ప్రకారం తీవ్రమైన చట్ట ఉల్లంఘన అవుతుంది. అలాగే విద్యుత్ శాఖ అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ముంపు ప్రాంతంలో కిలోమీటరు దూరం వరకు అక్రమంగా కరెంట్ లైన్లు లాగారు. ముంపు ప్రాంతంలో జీవనోపాధి కోసం మట్టి కొట్టుకునే స్థానిక పేద రైతులను మంత్రి అనుచరులు అడ్డుకుంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తాము మాత్రం అడ్డుఅదుపు లేకుండా అక్రమ తవ్వకాలు జరుపుతున్నారు.
ప్రాజెక్టులో గుడి కడుతాం అనే నెపంతో అక్కడ జెండాలు పాతి, భవిష్యత్తులో ఈ కబ్జాను క్రమబద్ధీకరించుకునేందుకు కుట్రలు చేస్తున్నారు. ప్రాజెక్ట్ రిపేర్ కోసం నీటిని ఖాళీ చేస్తే, ఆ ఖాళీ స్థలాన్ని సొంత వ్యాపారానికి వాడుకోవడం అన్యాయం. అధికార పక్షానికి చెందిన వ్యక్తి కావడంతో స్థానిక అధికారులు కళ్ళున్నా కనపడనట్లు వ్యవహరిస్తున్నారు.
జిల్లాకు పెద్ద దిక్కుగా, పర్యావరణ పరిరక్షణ చట్టాల అమలు సంస్థగా అధికారిగా కలెక్టర్ జోక్యం చేసుకోవాలని తక్షణమే రెవెన్యూ, ఇరిగేషన్ మరియు విద్యుత్ శాఖాధికారులతో ఉమ్మడి విచారణ (Joint Inspection) జరిపించాలని క్రాంతి కిరణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేసి, విద్యుత్ లైన్లను తొలగించి, సింగూర్ ముంపు ప్రాంతాన్ని కాపాడటంతో పాటు బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా కోరారు.
