దేశవ్యాప్తంగా ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా షెడ్యూల్ను విడుదల చేసింది. 10 రాష్ట్రాల పరిధిలో మొత్తం 24 రాజ్యసభ స్థానాలకు జూన్ 18న పోలింగ్ నిర్వహించనున్నట్లు EC ప్రకటించింది. జూన్ 1న ఈ ఎన్నికలకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుండగా, జూన్ 8 వరకు నామినేషన్ల దాఖలుకు గడువు విధించారు.
జూన్ 18వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుండగా, అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు. ఈ మెగా షెడ్యూల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. AP కోటాలో ఉన్న నాలుగు రాజ్యసభ స్థానాలు ఈ విడతలో ఖాళీ అవుతుండటంతో, ఈ 4 స్థానాలు ఎవరికి దక్కుతాయనే దానిపై ఆసక్తి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలాన్ని బట్టి ఈ 4 స్థానాలూ ఏకపక్షంగా కూటమి ఖాతాలోనే పడనున్నాయి. అయితే ఈ నాలుగు సీట్లను కూటమి భాగస్వామ్య పక్షాలు ఎలా పంచుకుంటాయనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల త్యాగాలు, రాజకీయ సమీకరణాలను బట్టి తమకూ ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలని జనసేన, బీజేపీ అధిష్టానాలు గట్టిగా కోరుతున్నాయి. జాతీయ స్థాయిలో పెద్దల సభలో తమ ప్రాతినిధ్యాన్ని పెంచుకోవడానికి ఇదొక సువర్ణావకాశంగా మిత్రపక్షాలు భావిస్తుండటంతో, సీట్ల సర్దుబాటుపై కూటమి అగ్రనేతలు త్వరలోనే ఉమ్మడి నిర్ణయానికి రానున్నారు.
తెలుగుదేశం పార్టీలో ఆశావహుల సంఖ్య ఊహించని స్థాయిలో పెరిగిపోవడం చంద్రబాబు నాయుడికి తలనొప్పిగా మారింది. పార్టీ కోసం సుదీర్ఘకాలంగా కష్టపడిన సీనియర్ నేతలు, గత ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన వారు, సామాజిక సమీకరణాల రీత్యా ప్రాధాన్యత ఉన్న నేతలు ఈ దఫా ఎలాగైనా అవకాశం దక్కించుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
జూన్ 18న జరగబోయే ఈ రాజ్యసభ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో సీట్ల సర్దుబాటుకు పరీక్షగా మారనున్నాయి. ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పేందుకు మిత్రపక్షాలు పట్టుబడుతుండగా, సొంత పార్టీ నేతల ఒత్తిడిని తట్టుకుని చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది హాట్ టాపిక్గా మారింది.
