ఈ నెల చివరన పదవీ విరమణ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పదవీ కాలాన్ని మరోసారి పొడిగించాలంటూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించినట్లు సమాచారం.
అయితే ఇప్పటికే రామకృష్ణారావు పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం రెండు సార్లు పొడిగించింది. 1991 బ్యాచ్కు చెందిన కే.రామకృష్ణారావు 2025 ఏప్రిల్ 30న చీఫ్ సెక్రెటరీగా బాధ్యతలు చేపట్టగా, అదే ఏడాది ఆగస్టు 31న రిటైర్ కావాల్సింది. కానీ సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి మేరకు ఆయన సర్వీసును 7 నెలల పాటు కేంద్రం ఎక్స్టెన్షన్ చేసింది.
దీంతో ఈ ఏడాది మార్చి 31న ఆయన సర్వీస్ ముగుస్తుండగా మరోసారి ఆయన పదవీ కాలాన్ని పొడిగించాలని సీఎం రేవంత్ కేంద్రాన్ని కోరగా, మరో 3 నెలల పాటు ఆయన సర్వీసును ఎక్స్టెన్షన్ చేసింది. దీంతో రామకృష్ణారావు పదవీ కాలం ఈ నెల 30న ముగియనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో చీఫ్ సెక్రెటరీగా కొత్త అధికారిని నియమించడం వల్ల పలు ఇబ్బందులు వస్తాయని అంచనాకు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం రామకృష్ణారావును మరికొన్ని నెలల పాటు కొనసాగించడానికి మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది.
రామకృష్ణారావుకు మరోసారి ఎక్స్టెన్షన్ లభించకపోతే ఆ పదవిని దక్కించుకునేందుకు నలుగురు స్పెషల్ సీఎస్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆ జాబితాలో కేంద్ర సర్వీసులో ఉన్న సంజయ్ జాజు ముందు వరుసలో ఉన్నట్లు తెలిసింది. చీఫ్ సెక్రటరీ పదవి ఇవ్వాలని ఆయన కాంగ్రెస్ హైకమాండ్ పెద్దల వద్ద లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం.
మరోవైపు స్టేట్ సర్వీసులో ఉన్న జయేశ్ రంజన్, వికాస్ రాజు, సబ్యసాచి ఘోష్ సైతం సీఎస్ పోస్ట్ కోసం పోటీ పడుతున్నారు. అయితే ఈ నలుగురిలో ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి పలు కోణాల్లో ఆరా తీస్తున్నట్లు తెలిసింది. కిందిస్థాయి అధికారులతో కో ఆర్డినేషన్, ప్రభుత్వ పథకాల అమలులో చిత్తశుద్ధి ఉన్న ఆఫీసర్ కోసం అన్వేషణ చేస్తున్నట్లు సమాచారం.
