జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తెలంగాణకు చెందిన కొందరు రాజకీయ నాయకులు చేస్తున్న విమర్శలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. ఇటువంటి వ్యాఖ్యలు మంచి రాజకీయ విధానం కాదని, అనవసరంగా వివాదాలు, విద్వేషాలు సృష్టించే ప్రయత్నాలు చేయకూడదని ఆయన అన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయి ఇప్పటికే 12 సంవత్సరాలు పూర్తయ్యాయని గుర్తు చేసిన చంద్రబాబు, ఇప్పుడు పాత అంశాలను ప్రస్తావిస్తూ ప్రజల్లో ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడం సరైన పద్ధతి కాదని వ్యాఖ్యానించారు. ఏ ప్రాంతానికి ఎవరు ఏం చేశారో ప్రజలకు బాగా తెలుసని, తెలంగాణలోని కొందరు నాయకులు అనవసర విషయాలను లేవనెత్తుతున్నారని అన్నారు.
దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎక్కడి వ్యక్తి అయినా మరో రాష్ట్రంలో ప్రజల మద్దతుతో నాయకుడిగా ఎదగవచ్చని చంద్రబాబు పేర్కొన్నారు. తాను ఇటీవల తమిళనాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించి వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ, అక్కడ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి కె శివకుమార్ తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నేతలు ప్రచారంలో పాల్గొన్నారని చెప్పారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ కూడా ఉందని, బీఆర్ఎస్ గతంలో జాతీయ పార్టీగా విస్తరిస్తామని ప్రకటించి ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీ కార్యకలాపాలు ప్రారంభించిందని గుర్తు చేశారు. అలాంటప్పుడు ఇప్పుడు కొందరు నేతలు భిన్నంగా మాట్లాడటం ఎందుకో అర్థం కావడం లేదని అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు అనేక దేశాల్లో కీలక పదవులు చేపడుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్ వంటి దేశాల్లో తెలుగువారు రాజ్యాంగబద్ధమైన, ప్రజాప్రతినిధ్య బాధ్యతలను నిర్వహిస్తున్నారని చెప్పారు. ఆయా దేశాల రాజ్యాంగం, చట్టాల ప్రకారం ప్రజలకు సేవలు అందిస్తూ నాయకత్వ స్థానాలకు చేరుకుంటున్నారని వివరించారు.
రాజకీయ పార్టీలు ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టడం కంటే అభివృద్ధి, ప్రజాసేవలో పోటీ పడాలని చంద్రబాబు సూచించారు. ప్రజలకు మెరుగైన పాలన, సంక్షేమం, అభివృద్ధి అందించడంపైనే రాజకీయ నాయకుల దృష్టి ఉండాలని ఆయన అన్నారు.
