శంషాబాద్ పరిధిలోని హిమాయత్ సాగర్ సమీపంలో ఒక యువకుడు దారుణ హత్యకు గురవ్వడం స్థానికంగా కలకలం రేపింది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక నిర్మానుష్య ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. మృతుడిని టోలిచౌకి ప్రాంతానికి చెందిన వ్యాపారి అమీర్గా పోలీసులు గుర్తించారు. హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని గుర్తుపట్టకుండా ఉండేందుకు దుండగులు పెట్రోల్ పోసి తగలబెట్టే ప్రయత్నం చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితులు అమీర్ను ముందే హత్య చేసి ఇక్కడికి తీసుకువచ్చి తగలబెట్టారా, లేక సజీవ దహనం చేశారా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్షల వల్ల ఈ హత్య జరిగిందా లేక ఆర్థిక లావాదేవీలు ఏమైనా కారణమా అనే అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
