శుక్ర మూడమి ప్రారంభం కావడంతో శుభకార్యాలకు భారీ విరామం ఏర్పడింది. 2025 నవంబర్ 26వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ శుక్ర మూడమి, 2026 ఫిబ్రవరి 17వ తేదీ వరకు కొనసాగనుంది. మొత్తం 83 రోజులపాటు శుభముహూర్తాలు లభించకపోవడంతో వివాహాలు, నిశ్చితార్థాలు, పెళ్లిచూపుల వంటి ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోనున్నాయి.
శ్రీవిశ్వావసు నామ సంవత్సరం మార్గశిర శుద్ధ షష్ఠి నుంచి మాఘమాసం బహుళ అమావాస్య వరకు ఈ మూడమి కొనసాగుతుందని పండితులు తెలిపారు. ఈ కాలంలో గ్రహస్థితులు శుభకార్యాలకు అనుకూలంగా ఉండకపోవడంతో వివాహాలు, దేవత విగ్రహాల ప్రతిష్టలు, కొత్త ఇల్లు కొనుగోలు, బోర్లు వేయడం, పుట్టు వెంట్రుకలు తీసే కార్యక్రమాలు, చెవులు కుట్టించడం, ముఖ్యమైన ప్రయాణాలు, తీర్థయాత్రలు, కొత్త పనుల ప్రారంభం వంటి కార్యక్రమాలు శాస్త్రోక్తంగా వర్జ్యం. మూడు నెలలకు పైగా ముహూర్తాలు లేకపోవడంతో పలు కుటుంబాలు తమ కార్యక్రమాలను వాయిదా వేసుకునే అవకాశముంది.
అయితే ఈ మూడమి సమయంలో పూర్తిగా శుభకార్యాలు ఆగిపోవు. కొన్ని అవసరమైన శాస్త్రోక్త కార్యక్రమాలు మాత్రం నిర్వహించవచ్చు. సీమంతం, అన్నప్రాసన, నామకరణం, హోమాలు, నవగ్రహ శాంతులు, నిత్య పూజలు, చాతుర్మాస్య వ్రతాలు వంటి ఆచారాలు ఈ సమయంలో చేయడంలో ఎలాంటి అపచారం లేదని పండితులు స్పష్టం చేశారు. మూడమి ముగిసే 2026 ఫిబ్రవరి 17 తర్వాతే మళ్లీ వివాహాది శుభకార్యాల కోసం శుభముహూర్తాలు ప్రారంభమవుతాయి. దీంతో మాఘమాసం వచ్చే సరికి వివాహ వేడుకలు, ఇతర శుభకార్యాలు తిరిగి జోరందుకునే అవకాశముంది.
