జగన్ హయాంలో ఆర్భాటం గా నిర్వహించిన “ఆడుదాం ఆంధ్ర” క్రీడా సంబరాల్లో భారీ ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తేల్చిచెప్పింది. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి ఆర్కే రోజా, అప్పటి శాప్ (SAP) ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిల పాత్ర కీలకంగా ఉందని పేర్కొంటూ, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విజిలెన్స్ సంచలన సిఫార్సు చేసింది.
ఈ మేరకు సుమారు 30 పేజీలతో కూడిన సమగ్ర నివేదికను విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి సమర్పించింది. క్రీడా సామాగ్రి కొనుగోళ్లు, ప్రకటనలు, ఈవెంట్ నిర్వహణ పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనం పక్కదారి పట్టినట్లు ఈ నివేదికలో స్పష్టంగా వివరించారు. ముఖ్యంగా శాప్లోని ఐటీ విభాగంలో పనిచేసే కొందరు సిబ్బంది ఈ అవినీతికి సహకరించారని, నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు కట్టబెట్టడంలో వారు కీలక పాత్ర పోషించారని విజిలెన్స్ నిర్ధారించింది.
తక్కువ నాణ్యత కలిగిన క్రీడా కిట్లను అధిక ధరలకు కొనుగోలు చేసినట్లు చూపడం, అర్హత లేని సంస్థలకు కాంట్రాక్టులు ఇవ్వడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీ గండి కొట్టారని విజిలెన్స్ అధికారులు ఆధారాలతో సహా పేర్కొన్నారు. ఈ నివేదిక ఆధారంగా అప్పటి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది.

1 comment
ఈ దెబ్బ తో Iron Leg Roja జైలుకే!