ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ,ఉద్యానవన రంగాలు సరికొత్త విప్లవానికి నాంది పలుకుతున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి విజనరీ లీడర్షిప్కు నిదర్శనంగా..దావోస్ ప్రపంచ ఆర్థిక వేదికపై విత్తిన ప్రతిపాదనలు కేవలం నెలల వ్యవధిలోనే అమరావతి వేదికగా కార్యరూపం దాల్చాయి.
రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో UAE ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు ఎమిరేట్స్ ప్రభుత్వం పూర్తి అంగీకారం తెలిపింది. ఈ మేరకు యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం సచివాలయంలో సీఎం చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ అయి ఒప్పందాన్ని ఖరారు చేసింది.
ఈ బృహత్తర ప్రాజెక్ట్ రాకతో ఏపీలోని అన్నదాతలకు, ముఖ్యంగా ఉద్యాన రైతులకు మహర్దశ పట్టనుంది. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పండే మామిడి, అరటి, కోకో వంటి పంటలకు గ్లోబల్ మార్కెట్తో నేరుగా అనుసంధానం ఏర్పడనుంది. పంట సేకరించడం నుంచి ఎగుమతి చేసే వరకు సమగ్ర వాల్యూ చైన్ను ఈ క్లస్టర్ ద్వారా నిర్మిస్తారు. అత్యాధునిక కోల్డ్ స్టోరేజెస్, ప్రాసెసింగ్ యూనిట్లు, గ్లోబల్ ప్యాకేజింగ్ టెక్నాలజీ అందుబాటులోకి రావడం ద్వారా ఏపీ ఉద్యాన ఉత్పత్తులు నేరుగా అరబ్ దేశాల మార్కెట్లకు చేరుకోనున్నాయి.
ఆహార శుద్ధి రంగానికే పరిమితం కాకుండా..ఫుడ్ సెక్యూరిటీ, అధునాతన లాజిస్టిక్స్, పోర్టు-ఎయిర్పోర్టు ఆధారిత రవాణా మౌలిక వసతులలో ఏపీ – UAE మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. దీనిద్వారా రాష్ట్రంలో వేలాది మంది గ్రామీణ యువతకు కొత్తగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించడమే కాకుండా, దళారుల ప్రమేయం లేకుండా రైతులకు అంతర్జాతీయ స్థాయి గిట్టుబాటు ధర దక్కనుంది. అంతర్జాతీయ ఒప్పందాలు అంటే కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, ఇంత వేగంగా క్షేత్రస్థాయికి తీసుకొచ్చి పెట్టుబడులను ఆకర్షించడంలో కూటమి ప్రభుత్వం తన ముద్రను మరోసారి నిరూపించుకుంది.
