హైదరాబాద్ శివారు మొయినాబాద్ ఫామ్హౌస్లో జరిగిన డ్రగ్స్ పార్టీపై తెలంగాణ ఈగల్ టీమ్ దాడులు చేసింది. ఈ సందర్భంగా పట్టుబడిన వారిలో BRS మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి, అర్జున్ రెడ్డి, కౌశిక్ రవితో పాటు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ కూడా ఉన్నారు.
ఈ వ్యవహారం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అయితే, ఈ వ్యవహారంలో జరుగుతున్న ప్రచారం చూస్తుంటే..అసలు నిందితులను పక్కన పెట్టి, BC నాయకుడైన మహేష్ యాదవ్ను రాజకీయంగా దెబ్బకొట్టేందుకు పెద్ద కుట్ర జరుగుతోందన్న అనుమానాలు బలపడుతున్నాయి.
ఈ ఘటనలో పట్టుబడిన వారందరికీ మొదట డ్రగ్స్ టెస్టులు నిర్వహించగా, పైలెట్ రోహిత్ రెడ్డితో పాటు మరో నలుగురికి పాజిటివ్ వచ్చింది. ఎంపీ మహేష్ యాదవ్కు మొదట జరిపిన పరీక్షల్లో నెగెటివ్ రాగా..ఆ తర్వాత ఉదయం జరిపిన టెస్టుల్లో పాజిటివ్ వచ్చిందని చెబుతున్నారు. ఒకే వ్యక్తికి గంటల వ్యవధిలో ఫలితాలు మారడం వెనుక ఏదైనా మతలబు ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నిజానికి మహేష్ యాదవ్ తప్పు చేస్తే చట్టం ప్రకారం శిక్ష అనుభవిస్తారు, కానీ విచారణ పూర్తికాకముందే ఆయనను టార్గెట్ చేయడం వెనుక రాజకీయ కోణం స్పష్టంగా కనిపిస్తోంది.
పుట్టా మహేష్ యాదవ్ యాదవ సామాజిక వర్గానికి చెందిన బలమైన బీసీ నాయకుడు. మొదటిసారి ఎంపీగా గెలిచినప్పటికీ, అతి తక్కువ కాలంలోనే ఏలూరు పార్లమెంట్ పరిధిలో తనదైన ముద్ర వేశారు. ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు పరిష్కారం చూపుతూ, రికార్డు స్థాయి అభివృద్ధి పనులు చేపడుతున్నారు.
పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటూ కేడర్లో ఉత్సాహం నింపుతున్న ఆయన ఎదుగుదలను సహించలేకనే, వైసీపీ సహా ప్రత్యర్థులు ఈ డ్రగ్స్ కేసును సాకుగా చూపి ఆయన రాజకీయ భవిష్యత్తును దెబ్బతీయాలని చూస్తున్నారు.
ఈ కేసులో అత్యంత కీలకమైన అంశాలు అనేకం ఉన్నాయి. ఫామ్హౌస్లో కాల్పులు జరగడం, పైలెట్ రోహిత్ రెడ్డి పీఏ తన ఫోన్ను పగలగొట్టి ఆధారాలు ధ్వంసం చేయడం వంటి తీవ్రమైన విషయాలను వదిలేసి, కేవలం మహేష్ యాదవ్ను బ్లేమ్ చేయడం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటో సామాన్య ప్రజలకు కూడా అర్థమవుతోంది.
పైలెట్ రోహిత్ రెడ్డి సహా రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఇతరుల విషయంలో మౌనం వహిస్తున్న వైసీపీ.. కేవలం యాదవ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ ఎంపీని మాత్రమే ప్రస్తావించడం వారి దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట.
గతంలోనూ రోహిత్ రెడ్డిపై డ్రగ్స్ ఆరోపణలు ఉన్నప్పటికీ, ఇప్పుడు ఆ పేర్లను నోరెత్తకుండా కేవలం ఒక బీసీ నేతను టార్గెట్ చేయడం వెనుక ఉన్న కుట్రను రాజకీయ విశ్లేషకులు ఎండగడుతున్నారు. విచారణ పూర్తికాకముందే సోషల్ మీడియాలో ఒక వ్యక్తి ప్రతిష్టను దిగజార్చడం హీనమైన చర్య అని చెప్పవచ్చు.
