హైదరాబాద్హోమ్

హైదరాబాద్‌లో ఘనంగా “యువ భారత్ రన్ 2026”

హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా వద్ద ఆదివారం (మార్చి 29, 2026) “యువ భారత్ రన్ 2026” కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (DPS) మరియు పల్లవి స్కూల్స్ సంయుక్త ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య తనయుడు యశస్వి మల్కా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మహోత్సవం దేశంలోనే అతిపెద్ద యువత ఆధారిత ఫిట్‌నెస్ ఉద్యమంగా నిలిచింది. 10,000 మందికి పైగా విద్యార్థులు, కుటుంబ సభ్యులు, యువ ప్రొఫెషనల్స్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైన ఈ రన్‌కు ఫిట్ ఇండియా, కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ మద్దతు అందించగా, రెడ్ ఎఫ్‌ఎమ్ అధికారిక రేడియో భాగస్వామిగా వ్యవహరించింది.

ఈ రన్‌లో 5 కిలోమీటర్ల “ది ఛాలెంజ్” (టైమ్‌డ్ రన్), 2 కిలోమీటర్ల “రన్ అండ్ బాండ్” (కుటుంబ సభ్యులు, ప్రారంభికుల కోసం), 500 మీటర్ల “యంగ్ రన్నర్స్” (చిన్నారుల కోసం) వంటి విభాగాలు ఏర్పాటు చేశారు. అన్ని వయసుల వారికి అనుకూలంగా ఈ విభాగాలు ఉండటం విశేషం.

రన్‌తో పాటు జుంబా, యోగా వార్మప్ సెషన్స్, హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్, ప్లే జోన్స్, ఫుడ్ స్టాల్స్, గేమ్స్ వంటి వినోద కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. టైమ్‌డ్ కేటగిరీల్లో విజేతలకు మొత్తం రూ.1 లక్ష నగదు బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సినీ నటుడు శర్వానంద్ హాజరయ్యారు. గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల,వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు కలిసి జెండా ఊపి 2కే, 5కే రన్‌ను ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో హాజరైన విద్యార్థులను ప్రోత్సహించారు.

ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ యువతలో విదేశీ అలవాట్లు పెరుగుతున్నాయని, అందరూ తమ మాతృభాషలో మాట్లాడాలని కోరారు. తల్లిదండ్రులతో సమయం గడపడం, ఉదయం త్వరగా లేవడం, వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వంటి మంచి అలవాట్లు అలవరుచుకోవాలని సూచించారు. ఫాస్ట్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్ ఆరోగ్యానికి హానికరమని, “ఇన్‌స్టంట్ ఫుడ్ అంటే కాన్స్టంట్ డిసీజ్” అని వ్యాఖ్యానించారు.

సోషల్ మీడియా వినియోగంపై కూడా జాగ్రత్తగా ఉండాలని, అవసరమైనప్పుడు మాత్రమే మొబైల్ ఉపయోగించాలని, లేదంటే ఏకాగ్రత తగ్గి ఆందోళనలు పెరుగుతాయని హెచ్చరించారు. మంచి ప్రవర్తన, క్రమశిక్షణతో జీవనం సాగించాలని, కుటుంబ సభ్యులతో కలిసి సమస్యలను చర్చించి పరిష్కారం కనుగొనాలని సూచించారు. తల్లిదండ్రులు, గురువులను గౌరవించడం భారతీయ సంస్కృతిలో ముఖ్యమైన అంశమని పేర్కొన్నారు.

భారత్ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని, శక్తి ఇతర దేశాలపై దాడి చేయడానికి కాదు, స్వరక్షణ కోసం, తప్పును ఎదిరించడానికి అవసరమని చెప్పారు. చివరగా “వాక్ అండ్ కండక్ట్” అనే సందేశాన్ని యువతకు అందిస్తూ, నడక ఆరోగ్యానికి, ప్రవర్తన భవిష్యత్తుకు ఎంతో ముఖ్యమని తెలిపారు.

ఈ కార్యక్రమం యువతలో ఫిట్‌నెస్, క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన జీవన విధానంపై అవగాహన పెంపొందించడంలో కీలకంగా నిలిచింది.

Related posts

మై టిడిపి యాప్ వినియోగంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం

Satyam News

రూ. 347 కోట్లతో జోగులాంబ దేవాలయ అభివృద్ధి

Satyam News

అమరావతి బిల్లుకు తెలంగాణ మంత్రి హర్షం

Satyam News

పాకిస్తాన్ కు మళ్లీ హెచ్చరిక జారీ చేసిన భారత్

Satyam News

దుబాయ్ ఎయిర్ షో లో ప్రమాదం

Satyam News

ధర్మేంద్ర కేవలం భర్త మాత్రమే కాదు….

Satyam News

Leave a Comment