భారీ భూకంపంతో వెనిజులా అల్లాడింది. బుధవారం సాయంత్రం వరుసగా సంభవించిన రెండు భారీ భూకంపాలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. రిక్టర్ స్కేలుపై 7.2, 7.5 తీవ్రతతో నమోదైన ఈ భూకంపాల కారణంగా ఇప్పటివరకు కనీసం 32 మంది మృతి చెందగా, సుమారు 700 మంది గాయపడినట్లు తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగజ్ వెల్లడించారు.
రక్షణ సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసే ప్రయత్నాలు కొనసాగిస్తున్నందున మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా లా గారియా రాష్ట్రం అత్యధికంగా ప్రభావితమైందని, అనేక భవనాలు కూలిపోవడంతో అది విపత్తు ప్రాంతంగా మారిందని అధ్యక్షురాలు తెలిపారు.
భూకంపాల ప్రభావం రాజధాని కరాకస్ లో కూడా తీవ్రంగా కనిపించింది. భారీ కంపనాలతో ప్రజలు భయాందోళనలకు గురై భవనాల నుంచి బయటకు పరుగులు తీశారు. అనేక గోడలు కూలిపోవడం, విద్యుత్ స్తంభాలు నేలకూలడం, రహదారులపై శిథిలాలు పేరుకుపోవడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా, మొబైల్ సంకేతాలు పూర్తిగా నిలిచిపోయాయి.
అమెరికా భూగర్భ సర్వే సంస్థ ప్రకారం తొలి భూకంపం మొరాన్ ప్రాంతానికి పశ్చిమాన 22 కిలోమీటర్ల లోతులో సంభవించగా, కేవలం ఒక నిమిషం వ్యవధిలోనే రెండో భూకంపం 10 కిలోమీటర్ల లోతులో నమోదైంది. ఇవి గత శతాబ్దంలో వెనిజులాను తాకిన అత్యంత శక్తివంతమైన భూకంపాల్లో ఒకటిగా భావిస్తున్నారు.
ప్రభుత్వ స్పందన ఆలస్యమైందంటూ ప్రతిపక్ష నేత ఎడ్మండో గంజలాజ్ విమర్శించారు. విదేశీ ప్రవాసంలో ఉన్న ప్రతిపక్ష నాయకురాలు మారియా కొరినా మచాడో ప్రజలకు ధైర్యం, ఐక్యత అవసరమని సందేశం ఇచ్చారు.
పరిస్థితిని సమీక్షించిన అధికారులు ప్రజలు భవనాల వెలుపలే ఉండాలని, అనంతర ప్రకంపనల ముప్పు ఇంకా కొనసాగుతోందని హెచ్చరించారు. అత్యవసర సేవలకు ఆటంకం కలగకుండా అంబులెన్సులకు మార్గం ఇవ్వాలని సూచించారు.
భూకంపాల ప్రభావం పొరుగు దేశాలైన కొలంబియా, బ్రెజిల్ లో కూడా కనిపించింది. బ్రెజిల్లోని మనౌస్, బెలెం, మకాపా నగరాల్లో భవనాలను ఖాళీ చేయించారు. కొలంబియాలో మాత్రం ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం నమోదు కాలేదు. అలాగే డోమినికన్ రిపబ్లిక్, వర్జిన్ ఐలాండ్ ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేయగా, పోర్టూ రికోకు జారీ చేసిన హెచ్చరికను అనంతరం ఉపసంహరించారు.
