ఉత్తరాంధ్రలోని నాలుగు జిల్లాలకు కీలకమైన రహదారి.. పొరుగు రాష్ట్రం ఒడిశా నుంచి నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే దారి.. ఏపీఎస్ ఆర్టీసికి భారీ ఆదాయం తెచ్చే రూటు.. అదే విశాఖపట్నం రాజాం రోడ్డు. ఇంత ముఖ్యమైన ఈ మార్గం ఒక్క వంతెన కారణంగా మూతపడింది. చీపురుపల్లి సమీపంలోని రైల్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కారణంగా.. ప్రజలు 50 కిలోమీటర్లు చుట్టు తిరగాల్సిన దుస్థితి కలిగింది. వందేళ్ల క్రితం బ్రిటీష్ వాళ్ల పాలనలో ఇక్కడ నిర్మించిన పై వంతెన.. శిధిలావస్థకు చేరడంతో 2022లో రైల్వే శాఖ భారీ వాహనాల రాకపోకలను నిషేధించింది. దీంతో పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల ప్రజలను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వందేభారత్ ఎక్స్ప్రెస్లో విశాఖపట్నం నుంచి విజయవాడు నాలుగు గంటల్లో చేరుకోవచ్చు. కానీ వైజాగ్ నుంచి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజాం వెళ్లడానికి ఐదు గంటలకుపైనే పడుతోంది. చిలకపాలెం మీదుగా ఒక రూటు.. గరివిడి, ఉత్తరావల్లి మీదు మరో రూట్లో పల్లెలన్నీ తిరుగుతూ ప్రయాణించాల్సి రావడంతో మూడేళ్ల నుంచి ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి.
2022లో వైసీపీ హయాంలో కొత్త బ్రిడ్జి నిర్మాణం ప్రారంభమైనా.. జగన్ సర్కారు దిగిపోయే వరకూ పనులు ముందుకు సాగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. రైల్వే శాఖతో చర్చించి.. నిధులు సాధించడంతో పాటు.. పై వంతెన పనులను వేగవంతం చేశారు. దీంతో ఏడాది కాలంలోనే వంతెన నిర్మాణం పూర్తయింది. కూటమి ప్రభుత్వం 4 జిల్లాల ప్రజలకు సంక్రాంతి కానుకగా ఈ బ్రిడ్జిని జనవరి 10న ప్రారంభించడానికి ఏర్పాటు చేసింది. మన్యం జిల్లా నుంచి విజయనగరం లేదా శ్రీకాకుళం వెళ్లాలన్నా.. అత్యవసర పనుల కోసం వైజాగ్ వెళ్లే వారికి ఈ పై వంతెనతో ఎంతో సమయం ఆదా అవుతుంది. అతి తక్కువ సమయంలోనే.. పెద్ద సమస్యగా ఉన్న బ్రిడ్జి నిర్మాణం పూర్తయిందంటే.. డబుల్ ఇంజన్ సర్కారు అధికారంలో ఉండటమే ప్రధాన కారణం అని చెప్పుకోవాలి.
