కర్నూలు జిల్లా చిలకలడోన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టెంపో వాహనం-లారీ ఢీకొన్న ప్రమాదంలో 8 మంది మృత్యువాత పడటంపై విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంపై సీఎం ఆరా తీశారు.
కర్ణాటకకు చెందిన భక్తుల వాహనం మంత్రాలయం దర్శనానికి వస్తుండగా తెల్లవారుజామున 3.30 గంటలకు ప్రమాదం జరిగిందని, ఘటనా స్థలంలోనే 8 మంది మృతి చెందారని వివరించారు. గాయపడిన 10 మందికి ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని, తీవ్రంగా గాయపడిన వారిని కర్నూలు జీజీహెచ్కు తరలించి వైద్యం అందిస్తున్నట్లు వివరించారు.
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
