కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలపై నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసును మంగళవారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. ఈ దశలో ఈడీ అభియోగం చట్టపరంగా నిలబడదని కోర్టు స్పష్టం చేసింది.
ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద దాఖలైన ఫిర్యాదు ఎఫ్ఐఆర్పై ఆధారపడకపోవడంతో దాన్ని స్వీకరించలేమని స్పెషల్ జడ్జి (పీసీ యాక్ట్) విశాల్ గోగ్నే తీర్పు ఇచ్చారు. ఈడీ కేసు బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి మేజిస్ట్రేట్ కోర్టులో దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా ప్రారంభమైందని, కానీ పీఎంఎల్ఏ షెడ్యూల్లో ఉన్న ప్రాథమిక నేరానికి సంబంధించి ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని న్యాయస్థానం పేర్కొంది.
చట్టం ప్రకారం మనీలాండరింగ్ విచారణ, అభియోగాలు కొనసాగాలంటే తప్పనిసరిగా షెడ్యూల్ నేరానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. అలాంటి ఎఫ్ఐఆర్ లేకుండా ఈడీ ఫిర్యాదుపై కోర్టు దృష్టి సారించడం చట్టవిరుద్ధమని తెలిపింది. అందువల్ల పీఎంఎల్ఏ సెక్షన్లు 3, 4 కింద ఆరోపించిన మనీలాండరింగ్ నేరంపై కోర్టు గమనిక తీసుకోవడం నిరాకరించి, ఈడీ అభియోగాన్ని కొట్టివేసింది.
చట్టాన్ని అనుసరించకుండా కేసు పెట్టడం ఏమిటి?
చట్టం నిర్దేశించిన మౌలిక ఆధారం లేకుండా ఈ నిబంధనల కింద చర్యలు కొనసాగలేవని కోర్టు వ్యాఖ్యానించింది. అయితే, ఈ వ్యవహారంలో ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయాన్ని న్యాయమూర్తి గుర్తు చేశారు.
ఈ నేపథ్యంలో ఈడీ ఆరోపణల సారాంశాన్ని ఈ దశలో పరిశీలించడం ముందస్తు చర్య అవుతుందని కోర్టు తెలిపింది. దర్యాప్తు కొనసాగుతున్నందున, చట్ట ప్రకారం అవసరమైన తదుపరి వాదనలు దాఖలు చేసుకునే అవకాశాన్ని ఈడీకి కోర్టు ఇచ్చింది. ఈ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు సుమన్ దూబే, సామ్ పిత్రోడా, యంగ్ ఇండియన్, డోటెక్స్ మెర్చండైజ్, సునీల్ భండారి అనే వారిని కూడా ఈడీ నిందితులుగా పేర్కొంది.
అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు చెందిన ఆస్తులను మోసపూరితంగా స్వాధీనం చేసుకోవడం వల్ల వచ్చిన ఆదాయాన్ని మనీలాండరింగ్ చేశారని ఈడీ అభియోగం. నేషనల్ హెరాల్డ్ పత్రికకు ఏజేఎల్ ప్రచురణ సంస్థ. ఈడీ వాదనల ప్రకారం, ఈ ఆస్తుల విలువ రూ.2,000 కోట్లకు పైగా ఉండగా, గాంధీలు మెజారిటీ వాటాదారులుగా ఉన్న యంగ్ ఇండియన్ సంస్థ వాటిని స్వాధీనం చేసుకుందని ఆరోపించింది.
ఆరోపణలను తీవ్రంగా ఖండించిన సోనియా, రాహుల్
ఏజేఎల్ షేర్లను యంగ్ ఇండియన్కు బదిలీ చేయడం ద్వారా అక్రమంగా ఆస్తులను కబ్జా చేయాలనే క్రిమినల్ కుట్ర జరిగిందని ఈడీ వాదించింది. షేర్ల విలువ, స్థిరాస్తులు, వాటి ద్వారా వచ్చిన అద్దె ఆదాయం ఇవన్నీ చట్టవిరుద్ధ ఆదాయమేనని పేర్కొంది. అయితే గాంధీలు ఈ ఆరోపణలను ఖండించారు. ఆస్తిని ఉపయోగించడం, ప్రదర్శించడం లేదా అనుభవించడం వంటి అంశాలు లేకుండానే మనీలాండరింగ్ ఆరోపించడం ఇదే తొలిసారి అని వారు వాదించారు.
యంగ్ ఇండియన్ ద్వారా ఏజేఎల్ ఆస్తులను కబ్జా చేయలేదని, అప్పు ఒప్పందం ద్వారా ఏజేఎల్ను రుణముక్తం చేయడానికే ఈ లావాదేవీలు జరిగాయని స్పష్టం చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసు సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదుతో ప్రారంభమైంది.
సత్యమే గెలిచింది: కాంగ్రెస్
ఇందులో కాంగ్రెస్ నేతలు, యంగ్ ఇండియన్పై మోసం, క్రిమినల్ కుట్ర, నమ్మక ద్రోహం, ఆస్తుల దుర్వినియోగం వంటి ఆరోపణలు ఉన్నాయి. ఈడీ ఈ కేసులో తన అభియోగ పత్రాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 15న దాఖలు చేసింది. కోర్టు తీర్పుపై స్పందించిన కాంగ్రెస్ నేత, పార్టీ ప్రతినిధి సుప్రియా శ్రీనాతే “సత్యమే గెలిచింది.
మోదీ ప్రభుత్వ దురుద్దేశం, చట్టవిరుద్ధ చర్యలు పూర్తిగా బయటపడ్డాయి. యంగ్ ఇండియన్ కేసులో సోనియా గాంధీ జీ, రాహుల్ గాంధీ జీపై ఈడీ చేపట్టిన చర్యలు పూర్తిగా అక్రమమని, దురుద్దేశంతో కూడినవని గౌరవనీయ న్యాయస్థానం తేల్చింది” అని అన్నారు. ఎఫ్ఐఆర్ లేకుండా ఈడీకి కేసే లేదని, ఈడీకి అధికార పరిధి లేదని కోర్టు స్పష్టంగా చెప్పిందని ఆమె పేర్కొన్నారు.
గత దశాబ్ద కాలంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీపై మోదీ ప్రభుత్వం నడిపిన రాజకీయ ప్రేరిత వేధింపులు ప్రజల ముందే బహిర్గతమయ్యాయని విమర్శించారు. మనీలాండరింగ్ లేదు, అక్రమ ఆదాయం లేదు, ఆస్తుల బదిలీ కూడా లేదని ఆమె అన్నారు.
ఇవన్నీ రాజకీయ కక్ష సాధింపు, ప్రచారం, ప్రతిష్ఠ హననంలో భాగంగా తీసుకువచ్చిన నిరాధార ఆరోపణలేనని, ఇవాళ అవన్నీ ఓడిపోయాయని వ్యాఖ్యానించారు. సత్యం కోసం, ప్రతి భారతీయుడి హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ, మా నాయకత్వం పోరాటం చేస్తూనే ఉంటుందని, సత్యం కోసం పోరాడే మమ్మల్ని ఎవరూ భయపెట్టలేరని ఆమె చెప్పారు. “సత్యమేవ జయతే” అని ఆమె వ్యాఖ్యానించారు.
