ఏపీ ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ జాతీయ మీడియా దృష్టిని ఆకర్షిస్తున్నారు. అయితే నేషనల్ మీడియా ఫోకస్ చంద్రబాబు రాజకీయ వారసత్వం మీద కాదు. ఐటీ మంత్రిగా రాష్ట్రానికి పెట్టుబడుల సాధనలో లోకేశ్ సమర్ధత ఢిల్లీ లెవల్లో న్యూస్ వర్థీగా మారింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్కి లేపాక్షి భూములు ఆఫర్ చేయడం.. బెంగళూరును వదిలేయాలని అనుకొంటున్న కంపెనీలను విశాఖకు ఆహ్వానించడం వంటి చర్యలతో.. జాతీయ పత్రికలు, టీవీ ఛానల్స్ హెడ్లైన్స్లో.. లోకేశ్ పేరు మారుమోగింది. ఇక గూగుల్ డేటా సెంటర్ విషయంలో కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో చెలరేగిన రాజకీయ దుమారం.. పరోక్షంగా లోకేశ్ని పాపులర్ చేసింది.
విశాఖలో సీఐఐ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ముందు.. జాతీయ బిజినెస్ న్యూస్ సంస్థలన్నీ లోకేశ్ ఇంటర్వ్యూల కోసం క్యూ కట్టాయి. నేషనల్ మీడియాతో విస్తృతంగా ఇంటరాక్ట్ అయిన లోకేశ్ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల అంశంపై తన ఆలోచనలను పంచుకొన్నారు. గూగుల్ డేటా సెంటర్ కోసం 15 బిలియన్ డాలర్ల పెట్టుబడిన విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇంత భారీ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్టు 6 నెలలు ఆలస్యమైతే వడ్డీల భారం ఏ స్థాయిలో ఉంటుందో తనకు తెలుసునని.. అందుకే వేగంగా ప్రాజెక్టు పనులు ముందుకు సాగేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తున్నామని చెప్పారు. ప్రాజెక్టు వ్యయం ఎంత ఎక్కువగా ఉంటే.. అంత స్పీడ్గా పూర్తి చేయాల్సి ఉంటుందని వివరించారు. అందుకే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి ఏపీ ప్రభుత్వం ప్రధమ ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు.
ఇప్పటికే 10 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయని చెప్పారు లేకేశ్. 20 లక్ష మంది యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుబడులు సాధిస్తున్నామని అన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పనతో పాటు గత ప్రభుత్వం చేసిన భారీ అప్పుల నుంచి బయటపడాలన్నా.. పెట్టుబడులే మార్గమని వివరిస్తున్నారు లోకేశ్. ఏపీలో ట్రలియన్ డాలర్ల పెట్టుబడుల సాధనే తన టార్గెట్ అంటున్నారు. లక్ష కోట్ల డాలర్ల ఇన్వెస్ట్మెంట్ కమిట్మెంట్ సాధించిన రోజే తనకు ప్రశాంతంగా నిద్రపడుతుందని అంటున్నారు.
