అసెంబ్లీ ఎన్నికల ముందుకు వై నాట్ 175 అనే నినాదాన్ని ఎత్తుకున్న జగన్ ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో 11 సీట్లు చతికిలబడ్డ విషయం తెలిసిందే. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబునాయుడిని ఓడించడమే తన ధ్యేయమని జగన్ పని చేశారు. జగన్ తో బాటు పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా డబ్బులు వరదలా పారించారు. అక్కడ స్థానికంగా ఒక వ్యక్తిని పెట్టి అతడిని ప్రోత్సహించేందుకు అన్ని రకాల రాజకీయాలూ ఆడారు.
కుప్పంలో తానే అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పుకోవడానికి హంద్రీ నీవా కాలవ సెట్టింగ్ వేసి నీళ్లు ఇచ్చినట్లు జగన్ గొప్పలు చెప్పకున్నారు. అప్పటి సీఎం జగన్ స్కిట్లు వేసి అభాసుపాలు అయ్యారు. కానీ పులివెందులలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు పైప్లైన్లు వేసి.. ప్రజలకు నీళ్లు అందిస్తున్నారు. ప్రత్యర్ధి పార్టీ అధినేత సొంత నియోజకవర్గంలో పట్టు సాధించడానికి వైఎస్ జగన్ ప్రారంభించిన.. రాజకీయ చదరంగాన్ని.. సీఎం చంద్రబాబు నెక్ట్స్ లెవెల్కి తీసుకెళ్తున్నారు.
అయితే వైసీపీ పెద్దలు… కుప్పంలో టీడీపీ నాయకులను ప్రలోభాలకు గురి చేసి.. ప్రజలను భయపెట్టి.. పట్టు సాధించాలని అప్పటిలో ప్రయత్నించారు. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం.. పులివెందుల ప్రజలకు మేలు చేయడం ద్వారా.. అక్కడ పసుపు జెండా పాతాలని చూస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు గండికోట ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా పులివెందులకు నీళ్లిచ్చిన రికార్డు.. సీఎం చంద్రబాబు ఖాతాలో పడింది.
2024 ఎన్నికల ముందు ట్యాంకర్లతో నీళ్లు పోసి.. కుప్పం ప్రాంతానికి నీళ్లిచ్చామని జగన్ చేసుకున్న ప్రచారం అక్కడి ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. పులివెందులకు సాగునీరు అందించడంతో పాటు పల్లె పల్లెకు తాగునీరు అందించేందుకు 2019లోనే శ్రీకారం చుట్టారు సీఎం చంద్రబాబు. అంతలోనే అధికారం మారింది. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో.. జగన్ సొంత నియోజకవర్గానికి తాగు నీరు అందించే ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారు. జల్జీవన్ మిషన్ పథకం ద్వారా కేంద్రం నిధులు కేటాయించినా.. వాటినీ పూర్తిగా వాడుకోలేకపోయారు.
2024లో కూటమి ప్రభుత్వం పవర్లోకి వచ్చాక.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జల్జీవన్ మిషన్ను మరింత కాలం కొనసాగించడానికి ఒప్పించి.. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కించారు. పులివెందుల నియోజకవర్గం పరిధిలోని లింగాల, సింహాద్రిపురం, వేంపల్లె, వేముల, పులివెందుల, చక్రాయపేట మండలాల్లో ప్రజలకు నీళ్లు అందించేందుకు పైప్లైన్ల నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి.
వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులో భాగంగా మొత్తం 1,110 కిలోమీటర్ల పైప్లైన్లు వేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 950 కిలోమీటర్ల పైపులైన్ పనులు పూర్తి చేశారు. ఈ నెలాఖరులోగా పనులు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు డెడ్లైన్ పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో 2026 జనవరిలో పులివెందుల ప్రజలకు తాగునీరు అందించాలనే పట్టుదలతో ఉన్నారాయన. జగన్ గొప్పలు చెప్పుకోవడానికి కుప్పంలో స్కిట్లు వేస్తే.. సీఎం చంద్రబాబు వెయ్యి కోట్ల వ్యయంలో పైప్లైన్ల ద్వారా పులివెందుల ప్రజలకు తాగు నీరు అందిస్తున్నారు. ఇదే వీరిద్దరి మధ్య ఉన్న తేడా అని ప్రజలు కూడా గుర్తిస్తున్నారు.
