కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీ రాజధాని అమరావతికి కొత్త కళ వచ్చింది. రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. అమరావతిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ఇందులో భాగంగా రాజధానిలో స్పోర్ట్స్ సిటీని డెవలప్ చేస్తున్నారు.
మన దేశంలో క్రికెట్ తర్వాతే ఏ క్రీడలైనా.. ఏపీలోనూ అదే పరిస్థితి ఉంది. అందుకే ముందుగా రాజధాని ప్రాంతంలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నిర్మిస్తున్నారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్, బీసీసీఐ కలిసి ఈ స్టేడియాన్ని పూర్తి చేస్తున్నాయి. రాజధాని ప్రాంతంలోని నవులూరు దగ్గర నిర్మిస్తున్న అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పనులు దాదాపు పూర్తయ్యాయి.
మొత్తం 24 ఎకరాల విస్తీర్ణంలో 35 వేల మంది కూర్చొనే విధంగా.. ఆధునిక ప్రమాణాలతో క్రికెట్ స్టేడియం కడుతున్నారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్… ఈ స్టేడియాన్ని రాష్ట్రానికే తలమానికంగా అభివృద్ధి చేయాలని భావిస్తోంది. విజయవాడ నగరం నుంచి 13 కిలోమీటర్లు.. గుంటూరు సిటీ నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఈ స్టేడియం ఉంది.
ఇక్కడ మ్యాచ్లు నిర్వహిస్తే.. అటు విజయవాడ నుంచి.. ఇటు గుంటూరు నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివస్తారు. ఈ ఏడాదిలో నిర్మాణ పనులు పూర్తి చేయడంతో పాటు.. అంతర్జాతీయ ప్రమాణాలతో పిచ్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. త్వరలోనే ఈ స్టేడియంను అందుబాటులోకి తీసుకొస్తామని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు తెలియజేశారు.
ఈ సంవత్సరం స్టేడియం నిర్మాణం పూర్తయినా.. టీమిండియా షెడ్యూల్లో అంతర్జాతీయ మ్యాచ్ల వేదికలపై ముందే నిర్ణయం జరిగిపోతుంది. అంటే 2026 చివరికి లేదా.. 2027లో ఇక్కడ ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరగొచ్చు.
2027 ఐపీఎల్ సీజన్కి అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. అంటే వచ్చే సంవత్సరం విశాఖతో పాటు అమరావతిలోనూ ఐపీఎల్ మ్యాచ్లు జరిగే అవకాశం ఉంది. ఆ సమయానికి రాజధాని ప్రాంతం రూపు రేఖలు పూర్తిగా మారిపోతాయి. ఇక్కడ ఐపీఎల్ మ్యాచ్లు జరిగితే.. అమరావతికి మనదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం లభిస్తుంది.
