జగన్ వ్యూహాత్మక తప్పిదాలతో వైసీపీ దివాలా తీసే పరిస్థితికి వచ్చేసింది. రౌడీ షీటర్లను మాత్రమే పరామర్శించడం, నేరాలను ప్రోత్సహించడంతో బాటు రాజధాని అమరావతిపై విషం కక్కడంతో ఆ పార్టీలో కొనసాగేందుకు సీనియర్ నాయకులే భయపడుతున్నారు.
తాజాగా జగన్ మావిగన్ మా విధానం అంటూ ప్రకటించడం, రాజధానిగా అమరావతిని తాను అధికారంలోకి రాగానే మళ్లీ నాశనం చేసేస్తానని చెప్పడం పార్టీకి తీరని నష్టం కలిగిస్తుందని పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. అమరావతి వర్సెస్ మావిగన్ అంటూ వచ్చే ఎన్నికల అజెండాగా డిసైడ్ చేయడం వ్యూహాత్మకంగా అతి పెద్ద తప్పు అని వారు భావిస్తున్నారు.
ముఖ్య సలహాదారుడుగా పని చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి కూడా డ్యామేజి కంట్రోల్ కు రాలేని పరిస్థితి ఇప్పుడు నెలకొని ఉన్నదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంతే కాకుండా విజయవాడ పర్యటనకు వెళ్లిన సందర్భంగా రాజధాని విజయవాడ అని జగన్ రెడ్డి చెప్పడంతో నిన్ననే కదా మావిగన్ అన్నాడు…. మరి ఇప్పుడు విజయవాడ రాజధాని అంటున్నాడు ఏమిటి అనే కన్ఫ్యూజన్ లో వైసీపీ నేతలు కొట్టుమిట్టాడుతున్నారు.
పార్టీలో చర్చించకుండా ఎలా ప్రకటిస్తావ్?
కనీసం పార్టీలో చర్చించకుండా మావిగన్ ప్రకటన ఎలా ప్రకటన చేస్తారని సీనియర్ నాయకులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ నాయకులు తెగ బాధపడుతున్నట్లు సమాచారం.
అప్పట్లో విశాఖకు పాలన రాజధానిపై పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని సీనియర్లను పురమాయించారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఉన్నఫలంగా విశాఖను మరిచి మళ్లీ మావిగన్ స్టాండ్ తీసుకోవడంతో వారు పడుతున్న బాధ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ధర్మాన ప్రసాదరావు అయితే కోపంతో రగిలిపోతున్నారని ప్రచారం జరుగుతోంది.
విశాఖ నుంచి పాలన మొదలు పెడతామని జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చెప్పారు. రుషికొండ భవనాలు అందుకోసమే అనేది బహిరంగ రహస్యమే. కానీ ఆ భవనాలు విషయంలో అప్పట్లో జగన్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేకపోయింది వైసీపీ ప్రభుత్వం. కానీ పాలనా రాజధానిగా అన్ని సన్నాహాలు కూడా చేసుకున్నారు.
ఈ క్రమంలో ఉత్తరాంధ్రకు ప్రాధాన్యత కల్పిస్తుంటే అప్పటి టిడిపి, జనసేన నేతలు వ్యతిరేకించారని, దీనిని ప్రజల మధ్యకు తీసుకెళ్లాలని చెప్పడంతో శ్రీకాకుళం జిల్లాలో మంత్రి ధర్మాన ప్రసాదరావు అయితే గ్రామీణ ప్రాంత ప్రజలకు విడమరిచి చెప్పారు. విశాఖకు రాజధాని వస్తే ఈ ప్రాంతమే మారిపోతుందని, అందుకే ప్రజలు అర్థం చేసుకోవాలని అప్పట్లో గ్రామాలకు వెళ్లి మరి ధర్మాన ప్రసాదరావు ప్రచారం చేశారు.
సిగ్గు పోయిన బొత్స, ధర్మాన
విజయనగరం జిల్లా సైతం అభివృద్ధి చెందుతుందని, మన జిల్లా సైతం రాజధాని ప్రాంతమేనని అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ కూడా చెప్పారు. అప్పటిలోనే కాకుండా అధికారం కోల్పోయిన తర్వాత కూడా బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావులతో జగన్ అదే చెప్పించారు. చివరకు మావిగన్ అని ఆయన ప్రకటించడంతో ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్లు హతాశులయ్యారు.
అటు అమరావతి రైతులకు వ్యతిరేకమై, ఇటు ఉత్తరాంధ్ర ప్రజలకు మభ్యపెట్టి మనం చేసేది ఏంటి అని వైసిపి సీనియర్లు అంతర్మధనంతో ఉన్నట్లు తెలుస్తోంది. మొన్ననే దేవినేని అవినాష్ తమ పార్టీ అమరావతికి వ్యతిరేకం కాదు అని తేల్చి చెప్పారు. ఇంతలోనే అమరావతికి వ్యతిరేకం అని జగన్ ప్రకటించేశారు.
మరోవైపు రాయలసీమ నేతలు సైతం జగన్ రాజధాని స్టాండ్స్ పై ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి జగన్ అనాలోచిత ప్రకటనతో వైసీపీ అంతా అయోమయంలో పడిపోయింది. త్వరలో ఆ పార్టీని వీడేందుకు చాలా మంది నేతలు రెడీ అవుతున్నారని అంటున్నారు.
