సిరిసిల్ల నియోజకవర్గంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావుకు చేదు అనుభవం ఎదురైంది. తన సొంత నియోజకవర్గ పర్యటనలో భాగంగా పెద్దూరులోని బాలాజీ కాలనీకి వెళ్లిన కేటీఆర్ను స్థానిక ప్రజలు అడ్డుకుని నిలదీశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కౌన్సిలర్లు తమ వార్డుల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని, కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యంగా మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం తమ భూములను తీసుకున్నారని, అయితే ఇంతకాలం గడిచినా తమకు సరైన న్యాయం జరగలేదని బాధితులు కేటీఆర్ ఎదుట ఆవేదన వెళ్లగక్కారు. భూములు కోల్పోయిన తమకు పరిహారం విషయంలో మొండిచేయి చూపారని వారు మండిపడ్డారు. సొంత నియోజకవర్గంలోనే ఊహించని రీతిలో ప్రజల నుండి నిరసన సెగ తగలడంతో కేటీఆర్ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. స్థానికుల ప్రశ్నలతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
