విబి-జిఆర్ఏఎంజి ద్వారా శాశ్వత ఆస్తుల కల్పనకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చిత్త శుద్దితో పని చేస్తున్నాయని 20 సూత్రాల పథకం ఛైర్మన్ లంకా దినకర్ స్పష్టం చేసారు. ప్రధాని మోడీ చేపట్టిన వికసిత భారత్ సంకల్పంలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నిర్దేశించిన స్వర్ణాంధ్ర లక్ష్యాలను సాధించేందుకు కృషి చేద్దామని 20 సూత్రాల కార్యక్రమం ఛైర్మన్ లంకా దినకర్ పిలుపునిచ్చారు.
దీనికోసం ప్రజాప్రతినిధులు, అధికారులు పరస్పరం సమన్వయంతో పనిచేయాలని కోరారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభమైతే ఈ ప్రాంతం రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని, గణనీయమైన అభివృద్ది జరుగుతుందని చెప్పారు.రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్నారై సాధికారత సంబంధాల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డితో కలిసి వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై ఆయన శనివారం విజయనగరం కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.
విబి-జిఆర్ఏఎంజి, విద్య, వైద్యం, జలజీవన్ మిషన్, అమృత్, పిఎం సూర్యఘర్, పిఎం కుసుమ్ తదితర కేంద్ర ప్రభుత్వ పథకాలపై చైర్మన్ లంకా దినకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయాలని, విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకం స్థానంలో ఏప్రెల్ నుంచి అమలు చేయనున్న విబి-జిఆర్ఏఎంజి (వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవక మిషన్ -గ్రామీణ్) వల్ల గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వత ఆస్తుల కల్పనకు అవకాశం కలుగుతుందని చెప్పారు. ఈ పథకం కోసం కేంద్రం గతం కంటే ఎక్కువగా, తన 60 శాతం వాటా క్రింద 96వేల కోట్ల రూపాయలను కేటాయించిందని తెలిపారు.
అంతేకాకుండా ఈ పథకం అమల్లో అక్రమాలు చోటు చేసుకోకుండా పారదర్శకతను పెంచడంతోపాటు, ఫేస్ రికగ్నైజేషన్, జియో ట్యాగింగ్, ఆన్లైన్ మెజర్మెంట్ తదితర ఆధునిక విధానాలను ప్రవేశపెట్టడమే కాకుండా, పనిదినాలను 125 రోజులకు పెంచడం తదితర వినూత్న మార్పులను చేసిందని తెలిపారు.
ఈ పథకం వల్ల గ్రామీణ పేదలకు గతం కంటే మేలు జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 11 లక్షల నకిలీ జాబ్ కార్డులను తొలగించి, కొత్తగా అర్హులైన 5.5 లక్షల మందికి కొత్త కార్డులను జారీ చేసినట్టు తెలిపారు. గత ప్రభుత్వం అందుబాటులో ఉన్న ఉపాధిహామీ కన్వర్జెన్సీ నిధులను వినియోగించకోకుండా మురగబెట్టిందని చెప్పారు.
