బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు యస్. విష్ణువర్ధన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక ఆసక్తికరమైన ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఫిబ్రవరి 12, 2026 నాటి తన ట్విట్టర్ సందేశంలో ఆయన కమ్యూనిస్ట్ నేత నారాయణ ఆధ్యాత్మిక బాట పట్టడంపై స్పందించారు. దశాబ్దాల పాటు దేవుడు లేడనే సిద్ధాంతాన్ని నమ్మిన వారు, వయసు మళ్ళిన తర్వాత “అంతా ఆ దేవుడే చూసుకుంటాడు” అనే ఆధ్యాత్మిక బాటలోకి రావడం ఒక గొప్ప జ్ఞానోదయమని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం శుభపరిణామమని ఆయన కొనియాడారు.మార్క్సిస్ట్ గ్రంథాల్లో వెతికినా దొరకని ప్రశాంతత, వేంకటేశ్వరుని పాదాల చెంత లభిస్తుందని నారాయణ గ్రహించడం సంతోషకరమని ఆయన అన్నారు. ఎర్రజెండా నీడలో ఎన్ని విప్లవాలు చేసినా, జీవిత చరమాంకంలో ఆధ్యాత్మిక శాంతి అవసరమని ఈ ఘటన నిరూపిస్తోందని అభిప్రాయపడ్డారు.
నాస్తికత్వం అనేది కేవలం యవ్వనపు ఆవేశమని, వయసు పెరిగే కొద్దీ పరమాత్ముని ఉనికిని కాదనలేమని విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు.గతంలో గద్దర్, ఎన్. ప్రసాద్ రావు, శ్రీశ్రీ, రాహుల్ సాంకృత్యాయన్ వంటి దిగ్గజాలు సైతం ఇదే తరహాలో సత్యం వైపు పయనించారని ఆయన గుర్తు చేశారు.
ఎంతటి కరుడుగట్టిన విప్లవకారుడైనా చివరికి ఆధ్యాత్మిక సత్యాన్ని అంగీకరించక తప్పదని, నారాయణ విషయంలో జరిగింది రాజకీయ మలుపు కాదని, అది ఆయన ఆత్మ కనుగొన్న సత్యమని విష్ణువర్ధన్ రెడ్డి తన ప్రకటనలో స్పష్టం చేశారు.
