అనుకూలంగా తీర్పు వెలువరించేందుకు మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తికి లంచం ఇవ్వాలని ఓ సీనియర్ న్యాయవాది పిటిషనర్ వద్ద రూ.50 లక్షలు తీసుకున్నాడంటూ కేంద్ర న్యాయశాఖకు అందిన ఫిర్యాదు న్యాయవర్గాల్లో కలకలం రేపుతోంది.
ఆ ఫిర్యాదును కేంద్ర న్యాయశాఖ మద్రాసు హైకోర్టుకు పంపగా దీన్ని సదరు న్యాయవాది తీవ్రంగా ఖండించారు. ఎలాంటి విచారణకైనా సిద్ధమని ప్రకటించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో సదరు కేసు విచారణ నుంచి న్యాయమూర్తి తప్పుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని రిజిస్ట్రీని ఆదేశించారు.
తమిళనాడులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం వివరాలిలా ఉన్నాయి. 2008-09లో ఆన్లైన్ ట్రేడింగ్లో పాల్గొంటూ ఇండియన్ మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ను రూ.113.38 కోట్ల మేర మోసం చేశారనే ఆరోపణలపై నరేష్ ప్రసాద్ అగర్వాల్, గణేష్ అగర్వాల్లపై సీబీఐ కేసు నమోదు చేసింది.
వివిధ పరిణామాల అనంతరం ఈ వ్యవహారంపై విచారణ మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.నిర్మల్కుమార్ ముందుకు వచ్చింది. అయితే, ఈ కేసులో అనుకూలమైన తీర్పు రావాలంటే న్యాయమూర్తికి రూ.50 లక్షలు ఇవ్వాలంటూ పిటిషనర్ల నుంచి సీనియర్ న్యాయవాది మురళీకుమారన్ తీసుకున్నారని ‘ఆలిండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్’ నుంచి కేంద్ర న్యాయశాఖకు ఫిర్యాదు అందింది.
