దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సందడి చేస్తున్నారు. ఈ సదస్సు వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ రాష్ట్రాల అభివృద్ధి ప్రణాళికలను ప్రపంచానికి చాటిచెప్పనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పర్యటనలో భాగంగా పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో విడివిడిగా భేటీ కానున్నారు. ఉదయం జరిగిన ప్లీనరీ సెషన్లో పాల్గొన్న ఆయన, మధ్యాహ్నం వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) ఆధ్వర్యంలో నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంలో కీలక ప్రసంగం చేయనున్నారు. ఏపీలో సాంకేతిక విప్లవం, ఐటీ రంగంలో వస్తున్న మార్పులను ఆయన ఈ వేదికపై వివరించనున్నారు.
మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఏఐ పాలసీపై ఈ సదస్సులో ప్రత్యేకంగా ప్రసంగించనున్నారు. హైదరాబాద్ను గ్లోబల్ ఏఐ హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, స్టార్టప్లకు ఇస్తున్న ప్రోత్సాహం గురించి ఆయన వివరించనున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రుల పర్యటనతో ఢిల్లీ సమ్మిట్లో తెలుగు రాష్ట్రాల ప్రాధాన్యత సంతరించుకుంది.
