లావోస్ దేశంలో విదేశీ ఉద్యోగాల పేరుతో యువతను నమ్మించి, అక్రమంగా తరలించి సైబర్ మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
నిందితులు ఇస్లావత్ విజయేందర్ అలియాస్ ఆండ్రూ, మీసాల రాజశేఖర్, దండుగుల కళ్యాణ్ రమేష్ మరియు శ్యామ్ రావు రాజశేఖర్లను అదుపులోకి తీసుకున్నామని, వారి నుండి నాలుగు సెల్ ఫోన్లు, కీలక పత్రాలు, పాస్పోర్టులను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. ఈ ముఠాలోని మరో నిందితుడు రాజు (వైజాగ్) ప్రస్తుతం లావోస్లో ఉన్నాడని ఆయన పేర్కొన్నారు.
నిందితులు అమాయక యువతకు విదేశాల్లో ఆకర్షణీయమైన జీతాలతో ఉద్యోగాలు ఇప్పిస్తామని మభ్యపెట్టి లావోస్ దేశానికి తరలించేవారని పోలీసుల విచారణలో తేలింది. అక్కడికి వెళ్లిన తర్వాత బాధితుల పాస్పోర్టులను బలవంతంగా లాక్కుని, వారిని బందీలుగా ఉంచి సైబర్ నేరాలు చేయించేవారని ఎస్పీ వివరించారు.
ఈ మోసపూరిత నెట్వర్క్ ద్వారా యువతను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న ఈ గ్యాంగ్ను పట్టుకుని రిమాండ్కు తరలించామని ఆయన తెలిపారు. విదేశీ ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడే ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరైనా ఇలాంటి ప్రకటనలు చూసి మోసపోవద్దని యువతకు ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు.
నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందిని ఈ సందర్భంగా ఆయన అభినందించారు.
