రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ రౌడీ రాజ్యం నడుస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తే కాంగ్రెస్ నేతలు దాడులకు తెగబడటం అన్యాయమని, రాష్ట్రంలో ఎమర్జెన్సీ రోజులు పునరావృతమవుతున్నాయని ఆయన విమర్శించారు.
ఎంఐఎం మరియు కాంగ్రెస్ పార్టీలు కలిసి అరాచకాలు సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. కామారెడ్డిలో అగ్నికి ఆజ్యం పోసింది కాంగ్రెస్ పార్టీయేనని, బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంటిపై దాడి చేయడం అత్యంత అమానుషమని పేర్కొన్నారు. ఆత్మరక్షణ కోసం అడ్డుకుంటే, తిరిగి తమపైనే దాడి చేశారని చెప్పడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు.
కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో జరిగిన అరాచకాలను ప్రజలు గుర్తుంచుకోవాలని, ఎంఐఎంను కాపాడటానికే కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. బాన్సువాడలో 70 మందిని అక్రమంగా అరెస్ట్ చేశారని, రాళ్ల దాడి దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
బాన్సువాడ వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్ట్ చేయడం అన్యాయమని ఆయన అన్నారు. కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం దుర్మార్గమని, ఇలాంటి అరాచకాలను అడ్డుకోవడానికి బీజేపీ కార్యకర్తలు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
