వైకుంఠ ఏకాదశి (ముక్కోటి ఏకాదశి) పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ దంపతులు సంగారెడ్డి పట్టణంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయంలో ఏర్పాటు చేసిన ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామి వారిని దర్శించుకున్న మంత్రి దంపతులు, అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన స్వామి వారి పల్లకి సేవలో మంత్రి భక్తులతో కలిసి స్వయంగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైకుంఠపురం దేవాలయ అభివృద్ధికి, ముఖ్యంగా రాజగోపురం నిర్మాణానికి తన వంతుగా పూర్తి స్థాయిలో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
