రాజకీయాల్లో టైమ్ అస్సలు బాలేనప్పుడు అందరికీ గుర్తొచ్చేది ఆ దేవుడే. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా సరిగ్గా అలాగే ఉంది. గత ఐదేళ్లు తాడేపల్లి ప్యాలెస్కే పరిమితమైన మాజీ ముఖ్యమంత్రి.. ఇప్పుడు సడన్గా రూటు మార్చారు. గతంలో ఎన్నికల ముందు మాత్రమే సెట్టింగులు వేసి సీన్లు పండించే పాత పద్ధతికి గుడ్ బై చెప్పి, ఇప్పుడు ఏకంగా రియల్ఆలయాల బాట పట్టారు జగన్.
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమా కంటే పెద్ద సెన్సేషన్ కావడంతో.. ఆ ఎఫెక్ట్తో తన మీద పడ్డ హిందూ వ్యతిరేక ముద్రను చెరిపేసుకోవడానికి జగన్ గట్టిగానే ప్లాన్ చేశారు. విమర్శలను ఎదుర్కోవడానికి స్పిరిచువల్ కవర్ డ్రైవ్ ఆడుతున్నారు. అందుకే, కొత్తగా నిర్మించిన ఆలయాల విగ్రహ ప్రతిష్ఠాపనలకు రిబ్బన్ కట్ చేయడానికి స్వయంగా హాజరవుతున్నారు. అది నిజమైన భక్తితోనా లేక పొలిటికల్ భయంతోనా అనేది పక్కన పెడితే.. జగన్ టెంపుల్ రన్ మాత్రం ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారింది.
పక్కా ప్లాన్ ప్రకారం జగన్ తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటన షెడ్యూల్ చేసుకున్నారు. మంగళవారం సాయంత్రం పులివెందులకు చేరుకోనున్న ఆయన.. బుధవారం ఉదయం వేంపల్లి మండలం నందిపల్లి గ్రామానికి వెళ్లి, అక్కడ నూతనంగా నిర్మించిన నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులతో కలిసి ఆధ్యాత్మికంగా కాసేపు గడపనున్నారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం స్పీడు పెంచి పాత ఫైళ్లను దుమ్ముదులుపుతుంటే, జగన్ మాత్రం అవేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇక 26వ తేదీ ఉదయాన్నే పులివెందుల నుంచి తిరిగి బెంగళూరు ప్యాలెస్కు ఫ్లైట్ ఎక్కేయడమే ఈ ట్రిప్ హైలైట్. ఏది ఏమైనా, ప్యాలెస్ గడప దాటి జనం మధ్యకు రాని జగన్.. ఇప్పుడు గుడి గడపలు తొక్కుతుండటం చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు.
